ఇండియా సిమెంట్స్‌...

12 Nov, 2019 05:17 IST|Sakshi

ఇండియా సిమెంట్స్‌ కంపెనీ ఈ  ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.5.07 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.5.03 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియా సిమెంట్స్‌ తెలిపింది. సిమెంట్‌ అమ్మకాలు తగ్గినా, వ్యయాలు తగ్గడం, రియలైజేషనన్లు మెరుగుపడటం వల్ల నిర్వహణ పనితీరు ఒకింత మెరుగుపడిందని కంపెనీ ఎమ్‌డీ ఎన్‌. శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. కార్యకలాపాల ఆదాయం రూ.1,430 కోట్ల నుంచి 11 శాతం వృద్ధితో రూ.1,269 కోట్లకు తగ్గిందని తెలిపారు. మొత్తం వ్యయాలు రూ.1,439 కోట్ల నుంచి రూ.1,271 కోట్లకు చేరాయని పేర్కొన్నారు.  గత క్యూ2లో 30.77 లక్షల టన్నులుగా ఉన్న సిమెంట్, క్లింకర్‌ అమ్మకాలు ఈ క్యూ2లో 26.67 లక్షల టన్నులకు తగ్గాయని తెలిపారు.  

మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్‌... 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో సిమెంట్‌కు డిమాండ్‌ బాగా తగ్గిందని, ఫలితంగా దక్షిణ భారత్‌లోనే డిమాండ్‌ తగ్గిందని శ్రీనివాసన్‌ వివరించారు. మధ్య ప్రదేశ్‌లో కొత్త ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్లో సిమెంట్‌కు డిమాండ్‌ పుంజుకోగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
బీఎస్‌ఈలో ఇండియా సిమెంట్స్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.84 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు