ఐటీసీ లాభం 4,173 కోట్లు

25 Oct, 2019 05:08 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.4,174 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం (రూ.3,045 కోట్లు)తో పోల్చితే 37 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. పేపర్‌ బోర్డ్స్, హోటళ్లు, ఎఫ్‌ఎమ్‌సీజీ ఇతర వ్యాపారాల జోరు కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని ఐటీసీ వెల్లడించింది. కంపెనీ సాధించిన అత్యధిక త్రైమాసిక లాభం ఇదే. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు ప్రయోజనం (రూ.166 కోట్ల మేర) సానుకూల ప్రభావం చూపించిందని ఐటీసీ పేర్కొంది.

నికర అమ్మకాలు రూ.12,019 కోట్ల నుంచి 6% వృద్ధితో రూ.12,759 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  సిగరెట్ల వ్యాపారం ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.5,842 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపారం(సిగరెట్లు కలుపుకొని) 6 శాతం వృద్ధితో రూ.9,138 కోట్లకు, ఎఫ్‌ఎమ్‌సీజీయేతర వ్యాపారాల ఆదాయం 4 శాతం పెరిగి రూ.3,286 కోట్లకు చేరాయి. ఇక హోటళ్ల వ్యాపారం ఆదాయం 17 శాతం వృద్ధితో రూ.446 కోట్లకు, వ్యవసాయ వ్యాపార విభాగం ఆదాయం 19 శాతం వృద్ధితో రూ.2,674 కోట్లకు, పేపర్‌ బోర్డ్స్, పేపర్, ప్యాకేజింగ్‌ విభాగం ఆదాయం 10 శాతం పెరిగి రూ.1,565 కోట్లకు  పెరిగాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు