ఎస్జీఎక్స్ నిఫ్టీ 33 పాయింట్లు మైనస్
యూఎస్, యూరప్ మార్కెట్ల జోరు
హుషారుగా.. ఆసియా మార్కెట్లు
ఆర్థిక పురోగతిపై అంచనాల ఎఫెక్ట్
నేడు (గురువారం) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.30 ప్రాంతంలో ఎస్జీఎక్స్ నిఫ్టీ 33 పాయింట్లు క్షీణించి 10,052 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్ఎస్ఈలో నిఫ్టీ జూన్ నెల ఫ్యూచర్స్ 10,085 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ ఫ్యూచర్ కదలికలను.. ఎస్జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. భారీ సహాయక ప్యాకేజీలు, లాక్డవున్ ఎత్తివేతల నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి జోరందుకోగలదన్న అంచనాలు బుధవారం అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లకు జోష్నిచ్చాయి. దీంతో యూరోపియన్ మార్కెట్లు 3-4 శాతం మధ్య జంప్చేయగా.. యూఎస్ 2-1 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియాలోనూ అన్ని మార్కెట్లూ హుషారుగా కదులుతున్నాయి. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలపడటంతో దేశీయంగానూ మార్కెట్లు ర్యాలీ బాటలో సాగుతున్నాయి. అయితే వరుసగా ఆరు రోజులపాటు లాభపడిన మార్కెట్లలో నేడు ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా నేడు మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని చెబుతున్నారు. కాగా.. బుధవారం వరుసగా ఆరో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల పరుగు తీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 284 పాయింట్లు జంప్చేసి 34,110 వద్ద నిలవగా.. నిఫ్టీ 82 పాయింట్లు ఎగసి 10,062 వద్ద ముగిసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్ఎస్ఈ నిఫ్టీకి తొలుత 10,006 పాయింట్ల వద్ద, తదుపరి 9,950 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,146 పాయింట్ల వద్ద, ఆపై 10,232 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్ నిఫ్టీకి తొలుత 20,635 పాయింట్ల వద్ద, తదుపరి 20,330 వద్ద సపోర్ట్ లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్ నిఫ్టీకి తొలుత 21,433 పాయింట్ల వద్ద, తదుపరి 21,925 స్థాయిలో రెసిస్టెన్స్ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.
ఎఫ్పీఐల ఇన్వెస్ట్మెంట్స్
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐలు) రూ. 1,851 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 782 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి.