పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్‌బీఐ: దాస్‌

22 Nov, 2023 17:48 IST|Sakshi

దేశంలో ద్రవ్యోల్బణం రోజురోజుకు పెరుగుతోంది. నిత్యావసర వస్తువులు మరింత ప్రియంగా మారుతున్నాయి. దానికితోడు అంతర్జాతీయ యుద్ధాలతో దేశాభివృద్ధికి ఆటంకం కలుగుతుందేమోనని ఆందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఫిక్కీ సమావేశంలో మాట్లాడారు. ద్రవ్యోల్బణాన్ని నాలుగు శాతం లేదా అంతకంటే తగ్గించాలనే లక్ష్యంతో ఆర్‌బీఐ పనిచేస్తోందని ఆయన అన్నారు.

ద్రోణాచార్యుడి పరీక్షలో చెట్టుపై ఉన్న పక్షి కన్నును చూస్తున్న అర్జునుడితో ఆర్‌బీఐ పనితీరును పోల్చారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ప్రతి పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు వివరించారు. భౌగోళిక రాజకీయ సవాళ్ల మధ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు కొత్త నిబంధనలు తీసుకొచ్చిన నేపథ్యంలో వాటి పనితీరును ఉద్దేశించి ‘సుదీర్ఘ ఆట ఆడండి. రాహుల్ ద్రావిడ్ లాగా ఆడండి’ అని అ‍న్నారు. 

తాను ఇటీవల ఓ విమానాశ్రయానికి వెళితే అక్కడే ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ బృందం ద్రవ్యోల్బణం, వడ్డీరేట్లు ప్రభావంపై ప్రశ్నలడిగినట్లు దాస్‌ ఫిక్కీ సమావేశంలో తెలిపారు. ప్రజలకు ఆర్థిక అంశాలపై ఎంతో అవగాహన ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు