మారుతీ నుంచి కొత్త ఎర్టిగా...

22 Nov, 2018 01:08 IST|Sakshi

ధర రూ. 7.44 లక్షల నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: దేశీ ఆటోమొబైల్‌ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) మల్టీపర్పస్‌ వెహికల్‌ ఎర్టిగాలో కొత్త వెర్షన్‌ను బుధవారం ఆవిష్కరించింది. దీని ధర రూ. 7.44 లక్షల నుంచి ప్రారంభమవుతోంది. ఇది ప్రస్తుతమున్న ఎర్టిగా కంటే మరింత పెద్దదిగాను, 10 శాతం అధికంగా ఇంధనం ఆదా చేసేదిగాను ఉంటుందని సంస్థ తెలిపింది. పెట్రోల్‌ వేరియంట్‌లో స్మార్ట్‌ హైబ్రిడ్‌ టెక్నాలజీ, లిథియం అయాన్‌ బ్యాటరీ తదితర ఫీచర్లుంటాయి. ఇప్పుడున్న వెర్షన్‌తో పోలిస్తే పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.71,000, డీజిల్‌ వేరియంట్‌ రేటు రూ.20,000 అధికంగా ఉంటుందని కంపెనీ తెలియజేసింది. డీజిల్‌ వేరియంట్స్‌ రేటు రూ.8.84 లక్షల నుంచి రూ.10.9 లక్షల దాకా ఉంటుంది. పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ.7.44 లక్షల నుంచి రూ.9.95 లక్షల దాకా ఉంటుంది.

మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్స్‌తో కొత్త ఎర్టిగాను తీర్చిదిద్దినట్లు మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. కొత్త ఎర్టిగా అభివృద్ధిపై రూ. 900 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు.. గత వెర్షన్‌ కంటే తాజా వెర్షన్‌ 40 మి.మీ. ఎక్కువ వెడల్పు, 5 మి.మీ. ఎత్తు, 99 మి.మీ. పొడవుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పెట్రోల్‌ వేరియంట్‌లో మైలేజీ.. మాన్యువల్‌ ట్రాన్స్‌మిషన్‌తో లీటరుకు 19.34 కి.మీ.గాను, ఆటోమేటిక్‌ విధానంలో లీటరుకు రూ. 18.69 కి.మీ.గా ఉంటుంది. డీజిల్‌ ఆప్షన్‌లో లీటరుకు 25.47 కి.మీ. దాకా మైలేజీ వస్తుంది.  

మరిన్ని వార్తలు