ఏపీలో మెటాలిక్స్‌ విత్తన కేంద్రం

21 Nov, 2018 00:03 IST|Sakshi

ఏడాదిలో ఏర్పాటు చేస్తాం: సీఈవో నాగరాజన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా గ్రూప్‌కు చెందిన అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ కంపెనీ మెటాలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఆంధ్రప్రదేశ్‌లో విత్తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ సీడ్‌ క్యాపిటల్‌గా అభివృద్ధి చెందుతోందని, ఎగుమతులక్కూడా అవకాశం ఉండటంతో ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలియజేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో రెండు విత్తన ఫ్యాక్టరీలతో పాటు కరీంనగర్, వరంగల్, ఏలూరు, కడప వంటి ప్రాంతాల్లో విత్తన ఉత్పత్తి కేంద్రాలున్నాయి.

మంగళవారమిక్కడ ‘జెనిటికల్లీ మోడిఫైడ్‌ ఆర్గానిజం’ (జీఎంవో) అనే అంశంపై జరిగిన చర్చలో మెటాలిక్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఎండీ అండ్‌ సీఈఓ ఎస్‌ నాగరాజన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’తో మాట్లాడారు. ప్రస్తుతం మెటాలిక్స్‌.. ధాన్య సీడ్స్‌ బ్రాండ్‌ పేరిట విత్తనాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ధాన్య నుంచి గోధుమ, పత్తి, మిరప, టమోటా, బెండ, జొన్న, సజ్జ వంటి విత్తనాలున్నాయని.. త్వరలోనే ఆవ విత్తనాలను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో రూ.315 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నామని.. ఇందులో ఏపీ, తెలంగాణ నుంచి రూ.15 కోట్ల వాటా ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు