ఆ భవనం కూల్చివేతకు ముహూర్తం ఖరారు

6 Mar, 2019 15:28 IST|Sakshi

నీరవ్‌ మోదీకి  ఊహించని షాక్‌

డిటొనేటర్లతో అలీబాగ్‌ భవనం కూల్చివేతకు రంగం సిద్ధం

ఇందుకు డిమోలిషన్‌ మ్యాన్‌కు బాధ్యతలు అప‍్పగింత

సాక్షి, ముంబై: డైమండ్‌ వ్యాపారి నీరవ్‌ మోదీకి ఊహించని షాక్‌ తగిలింది. పీఎన్‌బీ స్కాంలో ప్రధాన నిందితుడు నీవర్‌కు చెందిన అలీబాగ్‌ విలాసవంతమైన భవనాన్ని అధికూరులు  పూర్తిగా కూల్చి వేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారీ డిటోనేటర్లతో ఈ భవనాన్నిపూర్తిగా నేలమట్టం చేయడానికి శుక్రవారం ముహర్తం పెట్టారు. ఇందుకు ప్రత్యేక టెక్నికల్‌ బృందాన్ని కూడా రప్పించారు.
 
రాయగడ్‌ జిల్లాలో సముద్రతీర ప్రాంతంలో 30వేల చదరపుగజాల్లో విస్తరించి ఉన్న ఈ భవనానికి మూడు డ్రిల్లింగ్‌ మెషీన్ల సాయంతో రంధ్రాలు చేసిన డైనమేట్లు పేర్చి కుప్పకూల్చ నున్నామని అధికారులు చెప్పారు.  ఇప్పటికే ఈ భవనం  పిల్లర్స్‌లో  రంధ్రాలు చేసే  కార్యక్రమం చేపట్టామని తెలిపారు. అయితే ఈ విలువైన షాండ్లియర్‌ను, బుద్ధుని విగ్రహాన్ని భద్రపరిచామని దీన్ని ఈడీ అధికారులకు అప్పగిస్తామని చెప్పారు.  పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారంటూ జిల్లా అధికారులు కూల్చివేతకు ఆదేశించిన ఈ భవనాన్ని పీఎన్‌ బీ కేసులో ఈడీ ఎటాచ్‌​ చేసింది. ఈ బం‍గ్లా విలువ రూ.100 కోట్లు ఉంటుందని  అంచనా. 

ఈ మేరకు రాయగఢ్‌ జిల్లా కలెక్టరు విజయ్‌ సూర్యవంశి అదనపు కలెక్టరు భరత్‌ షితోలేకు బాధ్యతలను అప్పగించారు. పేలుళ్ల ద్వారా భారీ బిల్డింగులను కూల్చిన అనుభవం భరత్‌ సొంతం.  అంతేకాదు  డిమోలిషన్‌ మ్యాన్‌గా పేరు కూడా తెచ్చుకున్నారు. 

కాగా బ్యాంకింగ్‌ రంగంలో అతిపెద్ద కుంభకోణానికి కారకులు డైమండ్‌ వర్తకుడు నీరవ్‌ మోదీ, ఆయన మేనమాడ, గీతాంజలి గ్రూప్‌ అధినేత మెహుల్‌ చోక్సీ. సుమారు రూ14వేలకోట్ల మేరకు ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును ముంచేసి విదేశాలకు చెక్కేశారు.  ఇప్పటికే  వీరిపై సీబీఐ, ఈడీ కేసులను నమోదు చేయడంతోపాటు,  పలు ఆస్తులను ఎటాచ్‌ చేశాయి.  అటు  ప్రభుత్వం నీరవ్‌, చోక్సీల పాస్‌ పోర్టులను రద్దు చేసింది.  వీరిని తిరిగి దేశానికి రప్పించేందుకు  కసరత్తు  చేస్తున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు