స్క్రీన్‌ షాట్లు... ఇక కష్టమే!

10 Feb, 2018 14:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, టెక్నాలజీ : ఇకపై ఖాతాదారుడి ప్రైవసీని కట్టుదిట్టం చేయాలని సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ భావిస్తోంది. సేవ్‌ ఆప్షన్‌ లేకపోవటంతో ఇంతకాలం స్క్రీన్‌ షాట్ల, రికార్డింగ్‌ల ద్వారా ఇతరుల పోస్టులను కొందరు సేవ్‌ చేసుకుంటారన్న విషయం తెలిసిందే. ఇకపై అలా చేయటం కుదరదు. అందుకోసం ఓ ప్రత్యేక ఫీచర్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  

ది ఇండిపెండెంట్‌ కథనం ప్రకారం... ఒకవేళ మీరు ఇతరుల స్టోరీలను స్క్రీన్‌ షాట్ల రూపంలో సేవ్‌ చేయాలనుకుంటే వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాప్‌ అప్‌ నోటిఫికేషన్‌ వస్తుంది. ‘మీరు చేసే పని పోస్టు చేసేవారికి తెలిసిపోతుంది’ అని అందులో ఉంటుంది. ఒకవేళ మీరు ఓకే బటన్‌ గనుక క్లిక్‌ చేస్తే వెంటనే పోస్టు చేసిన వారికి అలర్ట్‌ వెళ్తుందన్న మాట. స్టోరీ వ్యూవ్స్‌లో కూడా ఎవరైతే స్క్రీన్‌షాట్ల రూపంలో మీ పోస్టులను సేవ్‌ చేస్తారో.. వారి పేరుతోపాటు సూర్యుడి ఆకారంలోని సింబల్‌ ఒకటి దర్శనమిస్తుంది. 

ఆ లెక్కన్న మీ స్టోరీలను స్క్రీన్‌ షాట్లు తీసేవారి వివరాలను తెలుసుకుని అప్రమత్తంగా ఉండొచ్చు. ఇదే తరహాలో వీడియోల రికార్డింగ్‌ విషయంలోనూ సేఫ్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఇన్‌స్టాగ్రామ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉండగా.. త్వరలోనే ఈ ఫీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి.

మరిన్ని వార్తలు