రైల్వే కీలక నిర్ణయం

17 Feb, 2018 16:17 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: గ్రీన్ ఇనీషియేటివ్‌లో భాగంగా  రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.  రైల్వే రిజర్వేషన్‌కు సంబంధించిన చార్ట్‌ను ఇకపై రైల్వే కోచ్‌లపై అతికించడాన్ని నిలిపివేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి  ఈ పద్ధతిని  నిలిపివేస్తున్నట్టు  రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఇప్పటికే న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే, సీల్దా స్టేషన్‌లో గత మూడు నెలలుగా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్‌లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలలపాటు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ  మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది.

తద్వారా ప్రపంచంలోని అతి పెద్ద నెట్‌వర్క్‌ భారతీయ రైల్వే పేపర్‌కోసం అవుతున్న  డబ్బును ఆదా చేయాలని  లక్ష్యంగాపెట్టుకుంది. ఇప్పటికే  ఈ  పద్ధతిని అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు అన్ని రైల్వేలలో ఆరు నెలలపాటు పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని  రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్‌లో మెరుగు పరుస్తామని రైల్వే శాఖ తెలిపింది.  డిజిటలైజేషన్‌లో భాగంగా ఇ-టికెటింగ్  విధానాన్ని అమలు చేయనున్నట్లు అధి​కారులు వెల్లడించారు. కాగిత రహిత కార్యకలాపాలను  ప్రోత్సహించాలనే యోచనలో భాగంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో  సంవత్సరానికి 28టన్నుల పేపర్‌ను ఆదా చేయడంతో పాటు రూ.1.70లక్షల  ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది.  కాగా ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా, రైల్వేలు దాని స్టేషన్లను ఏ, ఏ1, బీ,సీ,డీ, ఈ, ఎఫ్‌  మొత్తం 7 కేటగిరీలుగా  విభజించింది. ఇందులో 17 జోన్లు ఉన్నాయి.

మరిన్ని వార్తలు