3,000 కార్లను సమకూర్చుకుంటున్న డ్రైవెన్‌ 

30 Mar, 2019 00:44 IST|Sakshi

రూ.700 కోట్ల సమీకరణకు నిర్ణయం 

త్వరలో షేర్‌డ్‌ మొబిలిటీ ‘ఈ–వీ’ సేవలు 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మల్టీ బ్రాండ్‌ లగ్జరీ కార్‌ సబ్‌స్క్రిప్షన్‌ సర్వీసుల కంపెనీ కార్‌2డ్రైవ్‌ హైదరాబాద్‌లో తన సేవలను ప్రారంభించింది. సంప్రదాయ పద్ధతిలో కారు కొనుగోలుకు బదులు.. ఎటువంటి డౌన్‌ పేమెంట్, రిజిస్ట్రేషన్‌ చార్జీలు లేకుండా కేవలం చందా చెల్లించడం ద్వారా కస్టమర్‌ తనకు నచ్చిన కారును ఎంపిక చేసుకోవచ్చు. కారు డ్యామేజ్, రిపేర్లు, బీమా భారం అంతా కంపెనీదే. డ్రైవెన్‌ ప్రమోట్‌ చేస్తున్న కార్‌2డ్రైవ్‌ బెంగళూరులో కూడా సేవలు అందిస్తోంది. ఒక్కో కారు ఖరీదు రూ.1 కోటి పైనే ఉంటుందని డ్రైవెన్‌ ఎండీ అశ్విన్‌ జైన్‌ శుక్రవారమిక్కడ మీడియాకు చెప్పారు. ‘ప్రస్తుతం కంపెనీ వద్ద 145 లగ్జరీ కార్లున్నాయి. 500 సీసీ అపై సామర్థ్యమున్న సూపర్‌ ప్రీమియం 55 బైక్‌లు ఉన్నాయి’ అని వివరించారు. 

కొత్తగా 3,000 వాహనాలు.. 
దీర్ఘకాలిక చందా, అద్దె విధానంలో కార్లను అందించేందుకు డ్రైవెన్‌ వచ్చే 12 నెలల్లో 3,000 కార్లను కొనుగోలు చేయనుంది. కస్టమర్‌ కోరిన మోడల్, ఫీచర్ల ఆధారంగా వాహనాన్ని అందజేస్తారు. ఈ విధానంలో రూ.3 లక్షల కారును సైతం వినియోగదారు ఎంచుకోవచ్చు. వాహనాల కొనుగోలుకు రూ.700 కోట్లు సమీకరించే పనిలో ఉన్నట్టు డ్రైవెన్‌ భాగస్వామి సయ్యద్‌ హుస్సేన్‌ వెల్లడించారు. ‘ఈ–వీ’ పేరుతో షేర్‌డ్‌ మొబిలిటీ సేవలను ఏప్రిల్‌లో ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. వచ్చే 18 నెలల్లో ఆరు నగరాల్లో 30,000 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను ఇందుకోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు