‘ఇన్ఫోసిస్‌ ప్రైజ్‌ 2023’ విజేతలు వీరే..

15 Nov, 2023 20:55 IST|Sakshi

శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇంజినీర్లు సంబంధిత రంగాల్లో విశేష కృషి చేసినందుకుగాను ఏటా ఇన్ఫోసిస్ ప్రైజ్‌ను అందజేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పరిశోధకులు, శాస్త్రవేత్తలతో ఏర్పాటైన జ్యూరీ ఈ విజేతలను ఎంపిక చేస్తోంది. ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్ విభాగాల్లో ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ బహుమతులను సంస్థ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రదానం చేశారు. 

ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో ఈ ప్రైజ్‌ను ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ప్రొఫెసర్ సచ్చిదా నంద్ త్రిపాఠి అందుకున్నారు. ఈయన సస్టైనబుల్ ఎనర్జీ ఇంజినీరింగ్‌లో చేసిన పరిశోధనలకుగాను ఈ బహుమతి ప్రదానం చేశారు. భారీ స్థాయి సెన్సార్లు ఉపయోగించిన గాలిలోని కాలుష్యాన్ని గుర్తించేలా త్రిపాఠి పరిశోధనలు చేశారు. ఏఐ సహాయంతో ఆ డేటాను విశ్లేషించవచ్చు. దిల్లీలో నానో పార్టికల్ గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని ఈ పరిశోధనల వల్ల తెలిసింది. హ్యుమానిటీస్‌లో బెంగుళూరు సైన్స్ గ్యాలరీ వ్యవస్థాపక డైరెక్టర్ జాహ్నవి ఫాల్కీకి ఈ బహుమతి లభించింది. ఆమె అనేక వైజ్ఞానిక పరిశోధనలు చేసి ది అటామిక్ స్టేట్ అనే పుస్తకం రాశారు. న్యూక్లియర్ సైన్స్, ఆంథ్రపాలజీకు సంబంధించిన ఎన్నో కథనాలు ప్రచురించారు. 
 
లైఫ్ సైన్సెస్‌లో ఐఐటీ కాన్పూర్‌లో బయోలాజికల్ సైన్సెస్, బయో ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న అరుణ్ కుమార్ శుక్లా ఈ ప్రైజ్‌ గెలుచుకున్నారు. జీ-ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్ (జీసీసీఆర్‌)లో ఈ విశేష కృషి చేశారు. మ్యాథమెటిక్‌ సైన్సెస్‌లో జియోమెట్రీలో పరిశోధనలు చేసినందుకు ప్రొఫెసర్‌ భార్గవ్ భట్‌ ఈ ప్రైజ్‌ను గెలుచుకున్నారు. ఫిజికల్ సైన్సెస్‌లో కణ జీవశాస్త్రంలో చేసిన కృషికిగాను నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ముకుంద్ తట్టాయ్‌కు ఈ బహుమతి గెలుపొందారు. సోషల్‌ సైన్సెస్‌లో కొలంబియా యూనివర్సిటీలో పొలిటికల్‌ సైన్సెస్‌లో ప్రొఫెసర్‌గా ఉన్న కరుణా మంతెనా ఈ ప్రైజ్‌ గెలుచుకున్నారు.

మరిన్ని వార్తలు