పేటీఎం నుంచి సెకన్లలో ఆఫ్‌లైన్‌ పేమెంట్‌!

28 Apr, 2018 13:29 IST|Sakshi

డిజిటల్‌ లావాదేవీల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన పేటీఎం మరో కొత్త పేమెంట్‌  మోడ్‌ను లాంచ్‌ చేసింది. ట్యాప్‌ కార్డు పేరుతో భారత్‌లో తొలి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సొల్యుషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డు ద్వారా ఎన్‌ఎఫ్‌సీని వాడుతూ నగదును కంప్యూటర్‌ ఆథరైజ్డ్‌ పాయింట్‌ ఆఫ్‌ టర్మినల్స్‌కు బదిలీ చేయవచ్చు. నాన్‌-ఇంటర్నెట్‌ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని పేటీఎం కార్డును పేటీఎం లాంచ్‌ చేసింది. పేటీఎం ట్యాప్‌ కార్డు ద్వారా ఎన్‌ఎఫ్‌సీని వాడుతూ సురక్షితంగా, తేలికగా డిజిటల్‌ పేమెంట్లను చేసుకోవచ్చు. సెకన్ల వ్యవధిలోనే ఈ పేమెంట్లను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది. అయితే పేమెంట్లు జరుపడానికి యూజర్లు ట్యాప్‌ కార్డుపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేటీఎం అకౌంట్లలోకి మనీని యాడ్‌ చేయాల్సి ఉంటుంది. కన్జ్యూమర్లు, మెర్చంట్ల వద్ద ఉన్న అన్ని రకాల నెట్‌వర్క్‌ సమస్యలను ఇది అడ్రస్‌ చేస్తుంది.

ట్యాప్‌ కార్డును వాడుతూ వెనువెంటనే డిజిటల్‌ పేమెంట్లు జరుపడం కోసం పేటీఎం ప్రస్తుతం ఈవెంట్లు, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్లు, కార్పొరేట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటోంది. పేమెంట్‌ను జరుపడానికి మెర్చంట్‌ టర్మినల్‌ వద్ద కస్టమర్‌ కార్డును ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఫోన్లను పట్టుకెళ్లకుండానే ఈ లావాదేవీలు జరుపుకోవచ్చు. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడానికి తాము కృషిచేస్తున్నామని, చాలా మందికి ఇంటర్నెట్‌ యాక్సస్‌ లేదని, దీంతో పాటు కొందరు ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుపడానికి జంకుతున్నారని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసి రెడ్డి తెలిపారు. వారి కోసం పేటీఎం ట్యాప్‌ కార్డును తాము ఆఫర్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇది తమ యూజర్ల అవసరాల కోసం అంకితభావంతో తీసుకొచ్చామని, ఎప్పడికప్పుడు వినూత్నావిష్కరణలతో యూజర్ల ముందుకు వస్తున్నట్టు చెప్పారు.    

మరిన్ని వార్తలు