పెన్షన్‌ కోసం... ఎల్‌ఐసీ జీవన్‌శాంతి!

1 Oct, 2018 01:41 IST|Sakshi

లేటు వయసులో నికరంగా నెలవారీ పెన్షన్‌ అందుకోవాలనుకునే వారి కోసం జీవిత బీమా రంగ సంస్థ ఎల్‌ఐసీ... ‘జీవన్‌ శాంతి’ పేరిట సరికొత్త పెన్షన్‌ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీన్లో పెన్షన్‌ నిమిత్తం ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలా పెట్టిన పెట్టుబడిని బట్టే పెన్షన్‌ ఎంత వస్తుందనేది ఆధారపడి ఉంటుంది. పెన్షన్‌ ఏ వయసు నుంచి కావాలనుకుంటున్నారన్నది కూడా ఇందులో ముఖ్యమే. కాస్త ముందు నుంచే పెన్షన్‌ ఆశిస్తే కొంత తక్కువ వస్తుంది. అలాకాకుండా పెట్టుబడి పెట్టాక వీలైనంత లేటుగా పెన్షన్‌ ఆశిస్తే... ఎక్కువ వస్తుంది.  

పెన్షన్‌ కావాలనుకుని ఇందులో ఇన్వెస్ట్‌ చేసేవారికి కంపెనీ 2 ఆప్షన్లిస్తోంది. ఒకటి... పెట్టుబడి పెట్టినప్పటి నుంచే తక్షణం పెన్షన్‌ అందుకోవటం. రెండవది కొన్నాళ్ల తరవాత అందుకోవటం.  
పెన్షన్‌ చెల్లింపులు 1,2,3 నెలలు లేదా ఏడాదికో సారి చొప్పున ఎలా కావాలంటే అలా చెల్లిస్తారు.
 పాలసీ తీసుకోవటానికి కనీసం 35 ఏళ్లు... గరిష్ఠంగా 85 ఏళ్ల వయసులోపు ఉండాలి.  
ఇక కొన్నాళ్ల తరవాత నుంచి పెన్షన్‌ తీసుకోవాలనుకున్నవారు 79 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి.  
 దీన్లో కనీస పెట్టుబడి రూ.1.5 లక్షలు. గరిష్ఠ పెట్టుబడికి పరిమితి లేదు.  
 ఈ పాలసీని ఆన్‌లైన్లో కూడా పొందే అవకాశం ఉండడం గమనార్హం.
 పెన్షన్‌కు రకరకాల ఆప్షన్లున్నాయి. పాలసీదారు జీవించినంత కాలం పెన్షన్‌ పొందటం... ఆ తరవాత తన జీవిత భాగస్వామి కూడా అదే పెన్షన్‌ పొందటం... ఆ తరవాత ముందుగా చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని వారసులకు అందజేయటం వంటి ఆప్షన్‌ కూడా ఉంది.  
 ఎన్‌పీఎస్‌ నుంచి బయటకు వస్తున్నవారు కొంత మొత్తాన్ని యాన్యుటీ పథకాల్లో ఇన్వెస్ట్‌ చేయాల్సి వస్తుంది కనక దీని గురించి ఆలోచించవచ్చన్నది నిపుణుల మాట.

మరిన్ని వార్తలు