భారీ నష్టాలను మూటకట్టుకున్న పీఎన్‌బీ

15 May, 2018 16:30 IST|Sakshi

ముంబై : ప్రభుత్వ రంగ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో చోటు చేసుకున్న నీరవ్‌ మోదీ కుంభకోణం ఆ బ్యాంకును భారీ నష్టాల్లో ముంచెత్తింది. నేడు బ్యాంకు ప్రకటించిన 2017-18 ఆర్థిక సంవత్సరపు మార్చి క్వార్టర్‌ ఫలితాల్లో దాదాపు రూ.13,416.91 కోట్ల నికర నష్టాన్ని నమోదుచేసింది. అంతకుముందు సంవత్సరం క్యూ4లో బ్యాంకు రూ.261.9 కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంగతి తెలిసిందే. వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, మెహుల్‌ చౌక్సీ చేసిన 13వేల కోట్ల రూపాయల భారీ స్కాం మూలంగానే ఈ క్వార్టర్‌లో పీఎన్‌బీ ఇంత పెద్ద మొత్తంలో నష్టాలను నమోదు చేసిందని అధికారులు తెలిపారు.

పీఎన్‌బీ స్కాం వల్ల  గతేడాది క్వార్టర్‌లో నమోదైన 5,753.3  కోట్ల రూపాయల నష్టం కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. మొండి బకాయిల కేటాయింపులు దాదాపు మూడు రెట్లు పెరిగాయని పీఎన్‌బీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ కేటాయింపులు రూ.3,908.3 కోట్ల నుంచి రూ.10,080.9 కోట్లకు చేరాయని తెలిపింది. ఫలితంగా మొత్తం ఆదాయం రూ.12,889 కోట్ల నుంచి రూ.11,555 కోట్లకు తగ్గిందని వివరించింది.

అలానే మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల వాటా కూడా అధికంగా ఉన్నట్లు తెలిపింది. 2017, డిసెంబర్‌ నాటికి 12.11 శాతం, 2017 మార్చి చివరి నాటికి 12.5 శాతంగా ఉన్న ఎన్‌పీఏలు, 2018, మార్చి చివరి నాటికి మొత్తం రుణాల్లో 18.38 శాతానికి పెరిగినట్లు వెల్లడించింది. అంతేకాక ఎన్‌పీఏల నిష్పత్తి గత క్వార్టర్‌లో 7.55 శాతం, అంతకుముందు ఏడాది క్వార్టర్‌లో 7.81 శాతం ఉండగా, ఈ క్వార్టర్‌లో ఎన్‌పీఏల నిష్పత్తి 11.24 శాతానికి పెరిగింది.

నికర వడ్డీ ఆదాయం, ఇతర ఆదాయాలు...
అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్‌కు రూ.3,683.5కోట్లుగా ఉన్న నికర వడ్డీ ఆదాయం ఈ క్వార్టర్‌లో 16.8శాతం తగ్గి రూ.3,06335కోట్లకు చేరింది. రాయిటర్స్‌ పోల్‌ ప్రకారం నికర వడ్డీ ఆదాయం 7శాతం పెరిగి రూ.3,939.7కోట్లు పెరిగిందని అంచనా.

>
మరిన్ని వార్తలు