టాప్‌ బ్రాండుగా జియో ఫోన్‌ 

24 Jan, 2018 20:30 IST|Sakshi

50 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, రిలయన్స్‌ జియో తీసుకొచ్చిన జియోఫోన్‌ మార్కెట్‌లో దూసుకుపోతోంది. భారత్‌లో టాప్‌ ఫీచర్‌ ఫోన్‌ బ్రాండుగా పేరు తెచ్చేసుకుంది. 27 శాతం మార్కెట్‌ షేరుతో గతేడాది అ‍క్టోబర్‌-డిసెంబర్‌ క్వార్టర్‌లో రిలయన్స్‌ జియోఫోన్‌ దిగ్గజ టాప్‌ ఫీచర్‌ ఫోన్‌ బ్రాండుగా నిలిచినట్టు కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌లో తెలిసింది. క్వార్టర్‌ చివరిలో ఈ ఫోన్‌ సరఫరా అత్యధికంగా నమోదైనట్టు తెలిపింది. డిమాండ్‌, సప్లై గ్యాప్‌ను ఇది సమర్థవంతంగా నిర్వహించిందని కౌంటర్‌పాయింట్‌ పేర్కొంది.

ఇంత భారీ మొత్తంలో ఈ ఫోన్‌ అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం రికార్డు స్థాయిలో ప్రీ-ఆర్డర్లు, విలువైన నవీకరణగా చాలా మంది ఫీచర్‌ ఫోన్‌ యూజర్లు గుర్తించడమేనని కౌంటర్‌పాయింట్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పథక్‌ తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ స్థాయిలో జియోఫోన్‌ ఉండటం, ఉచితంగా అందించడం కంపెనీకి బాగా కలిసి వచ్చిందన్నారు. అదనంగా కొన్నేళ్ల తర్వాత ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్‌ ప్రకటించిన వ్యూహం కూడా ఫలించిందని చెప్పారు.

కాగ, గతేడాది జూలై 21న లాంచ్‌ చేసిన ఈ ఫీచర్‌ ఫోన్‌ 4జీ, వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ టెక్నాలజీతో మార్కెట్‌లోకి వచ్చింది. తొలుత రూ.1500 చెల్లించినప్పటికీ, ఇది ఉచితమే. మూడేళ్ల తర్వాత ఈ మొత్తాన్ని కంపెనీ రీఫండ్‌ చేయనుంది. 2.4 అంగుళాల డిస్‌ప్లే, 2000ఎంఏహెచ్‌ బ్యాటరీ, సింగిల్‌ నానో-సిమ్‌ స్లాట్‌, మైక్రో ఎస్డీ కార్డు స్లాట్‌ దీనిలో ఫీచర్లు.  జియోఫోన్‌ను మరింత ఆకర్షణీయంగా చేయడానికి, నెలవారీ రూ.153 ప్యాక్‌పై ఎక్కువ డేటాను కూడా కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. దీనిలోనే ఏడాది పాటు రూ.99 ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ కూడా ఉంది. జనవరి 26 నుంచి రోజుకు 1జీబీ బదులు జియోఫోన్‌పై 1.5జీబీ డేటా లభించనుంది. 

మరిన్ని వార్తలు