ఎగిరే కార్ల రేసులోకి ఆ కంపెనీ కూడా..

19 Jul, 2018 15:46 IST|Sakshi
రోల్స్‌ రాయిస్‌ ఎగిరే కారు

డ్రైవర్ అనే వాడే లేకుండా వాటంతట అవే నడిచే వాహనాలు రోడ్ల మీదకు వస్తాయి. కేవలం రోడ్లపైనే కాక, గగనంలోనూ స్వయంప్రతిపత్త వాహనాలు ఎగరబోతున్నాయి. ఈ బిగ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ట్రెండ్‌ ఇప్పుడిప్పుడే ప్రపంచమంతటా వ్యాప్తిస్తోంది. ఉబర్‌ దుబాయ్‌లో ఈ ఎగిరే ట్యాక్సీ నెట్‌వర్క్‌ను క్రియేట్‌ చేస్తుండగా.. గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు ల్యారీపేజ్‌ కిట్టి హాక్ అనే ఎగిరే కారు స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ఇప్పటికే పలువురు కస్టమర్లకు వీటిని ఆఫర్‌ చేస్తుంది కూడా. తాజాగ ఈ రేసులోకి రోల్స్‌ రాయిస్‌ కూడా వచ్చి చేరింది. యూకేలో జరిగిన ఫార్న్‌బోరో అంతర్జాతీయ ఎయిర్‌ షోలో ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది.

ఈ వెహికిల్‌ హెలికాప్టర్‌ తరహాలో గగనతలంలో ఎగరడంతోపాటు రోడ్డుపైనా దూసుకెళ్తుంది. ఈ వెహికిల్‌ ఐదుగురు ప్రయాణికులను తీసుకెళ్లడంతో పాటు, గాల్లో 500 మైళ్ల (805 కిలోమీటర్లు) వరకు ప్రయాణించగలదని, గంటకు గరిష్ఠంగా 200 మైళ్ల వేగంతో దూసుకెళ్లగలదని సంస్థ తెలిపింది. మరో ఏడాదిన్నరలో ఈ హైబ్రిడ్‌ ఫ్లయింగ్‌ ట్యాక్సీ ప్రొటొటైప్‌ సిద్ధం కానుందని, 2020నాటికి వెహికిల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని రోల్స్‌రాయిస్‌ ఎలక్ట్రిక్‌ టీమ్‌ హెడ్‌ రాబ్‌ వాట్సన్‌ తెలిపారు.  టేకాఫ్‌ అవ్వడం కానీ ల్యాండ్‌ అవ్వడం కానీ వెర్టికల్‌గా జరుగుతుందని కంపెనీ తెలిపింది. ఈ వెహికిల్‌ వింగ్స్‌ 90 డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయని చెప్పింది. 

మరిన్ని వార్తలు