మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి...

25 Apr, 2020 05:54 IST|Sakshi

40 పైసలు పతనమై 76.46 వద్ద ముగింపు  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి బలహీన బాటను వీడడం లేదు. కరోనా కల్లోలం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ, ఈక్విటీల భారీ నష్టాల వంటివి దీనికి కారణం. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో శుక్రవారం రూపాయి కదలికలను చూస్తే... 40 పైసలు నష్టంతో 76.46 వద్ద రూపాయి విలువ ముగిసింది.  రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.91 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపు విలువ 76.83 (2020, ఏప్రిల్‌ 21వ తేదీ). ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అనూహ్యరీతిలో తన ఆరు డెట్‌ ఫండ్‌ స్కీమ్‌లను మూసివేయడం శుక్రవారం రూపాయి పతనానికి నేపథ్యం.  

పెరిగిన విదేశీ మారక నిల్వలు...
ఏప్రిల్‌ 17తో ముగిసిన వారంలో భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు 3.09 బిలియన్‌ డాలర్లు పెరిగి (అంతక్రితం ఏప్రిల్‌ 10తో ముగిసిన వారంతో పోల్చితే) 479.57 బిలియన్‌ డాలర్లకు చేరాయి.  మార్చి 6తో ముగిసిన వారంలో భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు లైఫ్‌టైమ్‌ హై 487.23 బిలియన్‌ డాలర్లు.

మరిన్ని వార్తలు