సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 33746 వద్ద నిఫ్టీ 100 పాయింట్ల పతనంతో 10,358 వద్ద క్లోజ్ అయ్యాయి. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, స్టీల్, అల్యూమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్లకుతోడు దేశీయంగా పీఎన్బీ సంక్షోభం వంటి అంశాలు దేశీ స్టాక్ మార్కెట్లలో ప్రకంపనలు పుట్టించాయి. దాదాపు అన్నిరంగాలూ బలహీనపడగా..మెటల్ బాగా దెబ్బతీసింది. ఇంకా ఇదే బాటలో పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎఫ్ఎంసీజీ, రియల్టీ, ఫార్మా నష్టపోయాయి. పీఎన్బీ, గీతాంజలి మరింత కుదేలవ్వగా ఎస్బీఐస్వల్పంగా కోలుకుంది. అలాగే ప్రభుత్వ వాటా విక్రయం వార్తలతో బీఈఎంఎల్ పాజిటివ్గా దాదాపు 8శాతం లాభాలతో ముగిసింది.
హిందాల్కో, టాటా మోటార్స్, అరబిందో, అంబుజా, టాటా స్టీల్, హెచ్పీసీఎల్, యస్బ్యాంక్, వేదాంతా, ఆర్ఐఎల్, బజాజ్ ఆటో భారీగానష్టపోగా, మరోవైపు టీసీఎస్,ఎం అండ్ ఎం, సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఎంఅండ్ఎం, యూపీఎల్ , లాభపడ్డాయి.