ముంబై : ఆర్బీఐ పాలసీ నిర్ణయంతో మార్కెట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఆర్బీఐ తటస్థ విధానం కారణంగా చోటు చేసుకున్న కొనుగోళ్ల పర్వం నేటి ట్రేడింగ్లో కూడా కొనసాగుతోంది. దీంతో పాటు గ్లోబల్గా వస్తున్న పాజిటివ్ సంకేతాలు మార్కెట్లకు సహకరిస్తున్నాయి. సెన్సెక్స్ ప్రారంభంలోనే డబుల్ సెంచరీకి పైగా జంప్ చేసింది. ప్రస్తుతం 288 పాయింట్ల లాభంలో 35,466 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సైతం 71 పాయింట్ల లాభంలో 10,756 వద్ద ట్రేడవుతోంది.
బ్యాంకు షేర్లు నేటి ట్రేడింగ్లో జోరుగా కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్ల లాభాల్లోనే నడుస్తున్నాయి. బ్యాంకులతో పాటు ఆటోమొబైల్స్, మెటల్స్ మెరుపులు మెరిపిస్తున్నాయి. మిడ్క్యాప్స్ కూడా మంచి లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ మిడ్క్యాప్ ఇండెక్స్ సగం శాతానికి పైగా పెరిగింది. ట్రేడింగ్ ప్రారంభంలో ఐసీఐసీఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, హిందాల్కోలు ఎక్కువగా లాభపడగా.. విప్రో, కోల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్ నష్టపోయాయి. అటు నాస్డాక్ కాంపోజిట్ రికార్డు స్థాయిలో 7,689.24 వద్ద ముగిసింది. డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా 1.4 శాతం పెరిగి 25,146.39 వద్ద క్లోజైంది.