నేడు మార్కెట్లు నేలచూపులతో!

16 Jul, 2020 08:44 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌  నిఫ్టీ 22 పాయింట్లు డౌన్‌

బుధవారం యూఎస్‌ మార్కెట్లు అప్‌

ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

నిఫ్టీకి నేడు 10522-10425 వద్ద సపోర్ట్స్‌

నేడు (16న) దేశీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.35 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 22 పాయింట్లు బలహీనపడి 10,620 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ జులై నెల ఫ్యూచర్స్‌ 10,642 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కట్టడికి ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధిస్తున్న వార్తలతో బుధవారం మరోసారి యూఎస్‌ మార్కెట్లు 1 శాతం స్థాయిలో ముందంజ వేశాయి. మోడర్నా వ్యాక్సిన్‌పై ఆశలతో యూరోపియన్‌ మార్కెట్లు సైతం 2 శాతం ఎగశాయి. అయితే ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో అత్యధిక శాతం వెనకడుగులో ఉన్నాయి. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు నీరసంగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తదుపరి యధాప్రకారం ఆటుపోట్లను చవిచూసే వీలున్నట్లు భావిస్తున్నారు.

చివరికి అక్కడక్కడే
కోవిడ్‌ కట్టడికి విదేశీ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల ఫలితాలు ఆశలు రేకెత్తించడంతో బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు తొలుత హైజంప్‌ చేశాయి. అయితే చివరి గంటన్నరలో కొనుగోళ్లు తగ్గి అమ్మకాలు ఊపందుకోవడంతో చివర్లో మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. దీంతో ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 19 పాయింట్ల స్వల్ప లాభంతో 36,052 వద్ద నిలిచింది. నిఫ్టీ సైతం నామమాత్రంగా 11 పాయింట్లు బలపడి 10,618 వద్ద స్థిరపడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,522 పాయింట్ల వద్ద, తదుపరి 10,425 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే నిఫ్టీకి తొలుత 10,771 పాయింట్ల వద్ద, ఆపై 10,925 వద్ద అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,069 పాయింట్ల వద్ద, తదుపరి 20,797 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,774 పాయింట్ల వద్ద, తదుపరి 22,207 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.

భారీ అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 222 కోట్లు,  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 899 కోట్లు చొప్పున స్టాక్స్‌లో అమ్మకాలు చేపట్టారు. ఇక మంగళవారం సైతం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 1566 కోట్లు, డీఐఐలు రూ. 650 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే.

మరిన్ని వార్తలు