‘ర్యాన్‌బాక్సీ’ సింగ్‌ బ్రదర్స్‌ బాహాబాహీ!

8 Dec, 2018 01:38 IST|Sakshi

శివీందర్‌ నాపై దాడిచేశాడు: మల్వీందర్‌ సింగ్‌

నన్ను గోడకు అదిమేస్తే తోసేశానంతే: శివీందర్‌  

న్యూఢిల్లీ: ఒకప్పటి ఔషధ సంస్థ ర్యాన్‌బాక్సీ, ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లయిన సింగ్‌ సోదరుల మధ్య విభేదాలు మరింతగా ముదురుతున్నాయి. తాజాగా తమ్ముడు శివీందర్‌ సింగ్‌ తనపై దాడి చేశారంటూ అన్న మల్వీందర్‌ సింగ్‌ ఆరోపించారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియోలో ఈ మేరకు ఆరోపణలు చేశారు. డిసెంబర్‌ 5న శివీందర్‌ సింగ్‌ తనపై దాడి చేయడంతో చేతుల మీద గాయాలయ్యాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఆరోపణలను శివీందర్‌ ఖండించారు. గ్రూప్‌ కంపెనీ ప్రియస్‌ రియల్‌ ఎస్టేట్‌ బోర్డు మీటింగ్‌లో ఉద్యోగులను మల్వీందర్‌ సింగ్‌ వర్గం బెదిరిస్తోందన్న సమాచారంతో తాను అక్కడికి వెళ్లినప్పుడు వాగ్వాదం చోటు చేసుకుందని చెప్పారాయన.

ఇదే క్రమంలో మల్వీందర్‌ సింగ్‌ తనను బలవంతంగా గోడకు అదిమిపెట్టేయడంతో తప్పించుకునే క్రమంలో ఆయన్ను పక్కకు తోసేసేందుకు మాత్రమే ప్రయత్నించానని చెప్పారు. ఇంత జరిగిన తర్వాత మల్వీందర్‌తో కలిసి పనిచేసే మార్గాలన్నీ మూసుకుపోయినట్లేనని ఆయ న స్పష్టం చేశారు. ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో నిధుల మళ్లిం పు జరిగిందన్న ఆరోపణలు బయటపడినప్పట్నుంచి సింగ్‌ సోదరుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సం గతి తెలిసిందే. మల్వీందర్‌ సింగ్‌ ఫోర్జరీ, అవకతవక లకు పాల్పడ్డారని శివీందర్‌ సింగ్‌ ఆరోపిస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు