టాటా మోటార్స్‌కు ఫలితాల దెబ్బ 

8 Feb, 2019 11:19 IST|Sakshi

ఒక వైపు  రికార్డ్‌ నష్టాలు

మరోవైపు రికార్డు కనిష్టానికి టాటా మోటార్స్‌షేరు

30శాతం పతనం


సాక్షి, ముంబై: దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్‌కు ఫలితాల షాక్‌  తగిలింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) మూడో త్రైమాసికంలో   రికార్డ్‌ స్థాయి నష్టాలను నమోదు చేయడంతో టాటా మోటార్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇదే అత్యధిక త్రైమాసిక నష్టం  కావడంతో దాదాపు 30శాతం కుప్పకూలింది. 1993 తరువాత ఒక రోజులో ఇంత భారీ అమ్మకాలు నమోదయ్యాయి. గత దశాబ్ద కాలంలో శుక్రవారం ఈ స్థాయిలో పతనంకావండం ఇదే తొలిసారి.  అయితే అనంతరం 52 వారాల కనిష్టంనుంచి తేరుకుంది.  ఇదే బాటలో టాటా మోటార్స్‌ డీవీఆర్‌ సైతం ఏడాది కనిష్టానికి చేరింది. 

క్యూ3  ఫలితాలు 
ఈ ఏడాది క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో టాటా మోటార్స్‌ రూ. 26,993 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2017-18) క్యూ3లో రూ. 1077 కోట్ల నికర లాభం ఆర్జించింది.  అయితే గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్‌ తెలిపింది .

నిర్వహణ లాభం 20 శాతం క్షీణించి రూ. 6381 కోట్లను తాకింది. జేఎల్‌ఆర్‌ మార్జిన్లు 2.6 శాతం బలహీనపడి 8.3 శాతంగా నమోదయ్యాయి. లగ్జరీ కార్ల బ్రిటిష్‌ అనుబంధ సంస్థ జేఎల్‌ఆర్‌కు సంబంధించి రూ. 27,838 కోట్లను రైటాఫ్‌ చేయడంతో భారీ నష్టాలు ఏర్పడినట్లు కంపెనీ పేర్కొంది. చైనా తదితర దేశాలలో జాగ్వార్‌, ల్యాండ్‌రోవర్‌(జేఎల్‌ఆర్) వాహన అమ్మకాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు తెలిపింది.

మరిన్ని వార్తలు