భారత్‌పై డ్రాగన్‌ బుసలు‌: ట్రేడ్‌ వార్‌ ప్రారంభం

14 Aug, 2017 16:52 IST|Sakshi
భారత్‌పై డ్రాగన్‌ బుసలు‌: ట్రేడ్‌ వార్‌ ప్రారంభం
బీజింగ్‌ : భారత్‌పై డ్రాగన్‌ మరోసారి బుసలు కొట్టింది. ఇటీవల డొక్లామ్‌ వివాదానంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చైనా తనదైన శైలిలో వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది. తాజాగా 93 చైనా ఉత్పత్తులపై భారత్‌ యాంటీ డంపింగ్ డ్యూటీలు విధించిన అనంతరం ఇరు దేశాల మధ్య ట్రేడ్‌ వార్‌ పరిణామాలు కనిపిస్తున్నాయంటూ రెండు ఆ దేశ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. భారత్‌ తీసుకునే చర్యలకు చైనా ప్రతీకారం తీర్చుకోగలందంటూ తమ అక్కసును వెల్లగక్కాయి. భారత్‌లో పెట్టుబడులు పెట్టే చైనీస్‌ సంస్థలు ప్రమాదాల గురించి పునరాలోచించాలని అక్కడి అధికారిక కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన గ్లోబల్‌ టైమ్స్ పేర్కొంది. అంతేకాక భారత్‌ తీసుకునే చర్యలకు ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు కూడా ఆ దేశమే సిద్దమై ఉండాలని గ్లోబల్‌ టైమ్స్‌ హెచ్చరించింది. భారత ఉత్పత్తులపై పరిమితులు విధించి, తేలికగా చైనా ప్రతీకారం తీర్చుకోగలదని తన అక్కసును వెల్లగక్కింది.
 
చైనా నుంచి వచ్చే 93 ఉత్పత్తులపై గత బుధవారం భారత ప్రభుత్వం యాంటీ-డంపింగ్‌ డ్యూటీలు విధించింది. దీంతో భారత్‌, చైనాల మధ్య ట్రేడ్‌వార్‌ పరిణామాలు కనిపిస్తున్నాయని గ్లోబల్‌ టైమ్స్‌ రిపోర్టు పేర్కొంది. ఒకవేళ భారత్‌ నిజంగా చైనాతో ట్రేడ్‌ వార్‌కు సిద్ధమైతే, కచ్చితంగా చైనా ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయని, కానీ అంతేమొత్తంలో భారత్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సిక్కిం సరిహద్దు డొక్లామ్‌లో నెలకొన్న టెన్షన్‌ వాతావారణం వల్ల భారత్‌, చైనాల మధ్య ట్రేడ్‌ పరిస్థితులు కూడా దెబ్బతింటున్నాయి. ఈ వివాదానంతరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల విషయంలో గ్లోబల్‌ టైమ్స్, భారత్‌కు వార్నింగ్‌ ఇచ్చింది.
 
భారత్‌లో ఆర్థిక సహకార ప్రాజెక్టులు లేదా పెట్టుబడులను చైనా తాత్కాలికంగా రద్దు చేస్తుందంటూ గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొంది. చైనీస్‌ డైలీ కూడా భారత్‌కు వార్నింగ్‌ ఇస్తోంది. చైనీస్‌ ఉత్పత్తులను బాయ్‌కాట్‌ చేస్తే, భారత్‌కే ప్రమాదమని తన ఆర్టికల్‌లో పేర్కొంది. ఈ విషయంలో భారతే ఎక్కువగా బాధపడాల్సి వస్తుందని తెలిపింది. కాగ, మన దేశీయ ఎగుమతులు యేడాదియేడాదికి 12.3 శాతం మేర పడిపోగా, చైనా నుంచి భారత్‌కు వచ్చే దిగుమతులు మాత్రం 2 శాతం పెరగడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు భారత్‌కు 47 బిలియన్‌ డాలర్ల మేర ఏర్పడింది. 
మరిన్ని వార్తలు