నూతన ధరల విధానంతో పారదర్శకత

19 Dec, 2018 01:24 IST|Sakshi

స్టార్‌–మా నెట్‌వర్క్‌ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌జైన్‌ వ్యాఖ్య 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బ్రాడ్‌కాస్టింగ్‌ రంగంలో డిసెంబరు 29 నుంచి అమలులోకి రానున్న నూతన ధరల విధానంతో పారదర్శకత వస్తుందని ‘స్టార్‌ మా’ నెట్‌వర్క్‌ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌ తెలియజేశారు. స్టార్‌ ఇండియా డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌ హెడ్‌ గుర్జీవ్‌ సింగ్‌ కపూర్‌తో కలిసి మంగళవారమిక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. ‘నూతన ధరల విధానంలో ప్రతి చానెల్‌కు మీడియా సంస్థలు ఎంత చార్జీ చేసేదీ కస్టమర్‌కు తెలుస్తుంది. దీనినిబట్టి అవసరమైన చానళ్లను లేదా ప్యాక్‌నే వినియోగదారు ఎంపిక చేసుకుంటారు. ఈ విధానంతో బ్రాడ్‌కాస్టింగ్‌ రంగంలో పారదర్శకత వస్తుంది. గతంతో పోలిస్తే ఎంచుకున్న చానళ్లను బట్టి కస్టమర్ల నెలవారీ వ్యయంలో హెచ్చుతగ్గులుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో 2.2 కోట్ల ఇళ్లలో టీవీలున్నాయి. టీవీ వీక్షకుల్లో 31 శాతం వాటా ‘స్టార్‌ మా’ నెట్‌వర్క్‌కు ఉంది’ అని వివరించారు. స్టార్‌ వాల్యూ ప్యాక్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఎనిమిది భాషల్లో స్టార్‌ ఇండియా వినియోగదారులకు అవగాహన కల్పిస్తోంది. 

మరిన్ని వార్తలు