ఫోర్స్‌ ఇండియాకు మాల్యా గుడ్‌బై

1 Jun, 2018 19:58 IST|Sakshi
విజయ్‌ మాల్యా (ఫైల్‌ఫోటో)

లండన్‌ : రుణాల ఎగవేత కేసులో విచారణను ఎదుర్కొంటున్న లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా ఫోర్స్‌ ఇండియా డైరెక్టర్‌ పదవికి రాజీనామా చేశారు. న్యాయపరమైన వివాదాలను ఎదుర్కోవడంపై మరింత దృష్టిసారించేందుకే మాల్యా ఫోర్స్‌ ఇండియా నుంచి తప్పుకున్నారు. బ్రిటన్‌ కోర్టులో మాల్యా అప్పగింతను కోరుతూ భారత్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను ఎదుర్కొంటున్న వివాదాస్పద పారిశ్రామికవేత్త ఫార్ములా 1 కార్యకలాపాల్లోనూ ఇప్పటివరకూ చురుకుగా పాల్గొన్నారు. కాగా మాల్యా తన స్ధానంలో బోర్డులో తన కుమారుడిని నియమించినట్టు పేర్కొన్నారు.

తాను వైదొలిగేందుకు ఎలాంటి బలమైన కారణం లేకున్నా తన స్ధానంలో కుమారుడిని నియమించాలని భావించినట్టు ఆయన చెప్పారు. తాను న్యాయపరమైన చిక్కుల్ని ఎదుర్కొంటున్నందున కంపెనీపై ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఫోర్స్‌ ఇండియాలో మరో వివాదాస్పద పారిశ్రామికవేత్త సుబ్రతోరాయ్‌తో మాల్యా సహ భాగస్వామిగా ఉన్నారు. సహారా అధినేత సుబ్రతో రాయ్‌ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటూ జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు