భారీగా ఫేస్‌బుక్‌ షేర్ల విక్రయం: ఎవరు?ఎందుకు?

3 Mar, 2018 17:37 IST|Sakshi
ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ భారీ ఎత్తున షేర్లను విక్రయించారు. ఫేస్‌బుక్‌లోని సుమారు 500 మిలియన్‌ డాలర్ల విలువైన (రూ. 31,443 కోట్ల) షేర్లను అమ్మేశారు. డిసెంబర్ 2015లో తన భార్య ప్రిన్సిల్లా చాన్‌ ఏర్పాటు చేసిన ఫౌండేషన్‌  చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్(సీజెడ్‌ఐ) కు విరాళాలు అందించే నిమిత్తం జుకర్‌ బర్గ్‌  ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాయిటర్స్ లెక్కల ప్రకారం జుకర్‌బర్గ్ ఫిబ్రవరి చివరి మూడు రోజుల్లో 125.4 మిలియన్‌ డాలర్ల విలువైన 685,000 షేర్లను విక్రయించారు. దీంతో మొత్తం ఫిబ్రవరిలో 482.2 మిలియన్ డాలర్ల విలువైన 2.7 మిలియన్ షేర్లను ఆయన విక్రయించినట్టుగా గురువారం నాటి సెక్యూరిటీ ఫైలింగ్‌ ద్వారా తెలుస్తోంది. అయితే ఈ నిధుల ద్వారా రాబోయే సంవత్సరాల్లో ఫౌండేషన్‌ నిర్వహించే అనేక దాతృత్వ, స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించనున్నామని సీజెడ్‌ఐ ప్రతినిధి చెప్పారు. కాగా రాబోయే 18 నెలలో దాదాపు 35 నుంచి 75 మిలియన్ ఫేస్‌బుక్ షేర్లను విక్రయించనున్నట్టు గత సంవత్సరం సెప్టెంబర్‌లోనే జుకర్‌బర్గ్ ప్రకటించిన సంగతి విదితమే. అంతే కాదు... 99 శాతం (44 బిలియన్‌ డాలర్లు) ఫేస్‌బుక్ షేర్లను కూడా అమ్మేసి ఈ సంస్థ కోసం కేటాయించనున్నట్లు మార్క్ ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ , అతని భార్య మెలిండా గేట్స్ , బిలియనీర్ వారెన్ బఫెట్‌ స్థాపించిన బఫెట్ ఫౌండేషన్ లాంటివాటికి సమానమైనది జకర్‌బర్గ్‌ ఫౌండేషన్ కూడా.

మరిన్ని వార్తలు