అంచనాలను అందుకోలేక పోయిన విప్రో

15 Apr, 2020 16:49 IST|Sakshi

క్యూ4లో తగ్గిన విప్రో లాభాలు

వార్షిక ప్రాతిపదికన 6.3 శాతం క్షీణించిన లాభాలు

రెవెన్యూ గైడెన్స్ ను ప్రకటించని విప్రో

సాక్షి, ముంబై : ఐటీ సేవల సంస్థ విప్రోక్యూ4 ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను అందుకోలేకపోయింది. 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో విప్రో నికర లాభం వార్షిక  ప్రాతిపదికన 6.3 శాతం క్షీణించింది. ఈ త్రైమాసికంలో నికర లాభం రూ. 2,326 కోట్లుగా వుంది.  అదే సమయంలో రూ .15,711 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ .15,006 కోట్లతో పోలిస్తే ఇది 4.48 శాతం పుంజుకుంది. ఐటి సర్వీసెస్ సెగ్మెంట్ ఆదాయం 2,073.7 మిలియన్ డాలర్లు.  త్రైమాసిక ప్రాతిపదికగా ఇది 1 శాతం  తగ్గింది. ఐటి సర్వీసెస్ ఆపరేటింగ్ మార్జిన్ 0.8 శాతం క్షీణించి ఈ త్రైమాసికంలో 17.6 శాతంగా ఉంది. 

ఈ త్రైమాసికంలో ప్రతి షేరుకు ఆదాయాలు (ఇపిఎస్) ఒక్కో షేరుకు 4.09 రూపాయలు. ఇది 1.1 శాతం తగ్గింది.  కోవిడ్-19 మహమ్మారి అనిశ్చితి తమ కార్యకలాపాలకు ఎంతవరకు విఘాతం కలిగిస్తుందో స్పష్టత లేదని కంపెనీ ఫలితాల సందర్భంగా వెల్లడించింది. అందుకే  జూన్ 30 తో ముగిసే త్రైమాసికానికి గాను రెవెన్యూ గైడెన్స్  ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని తెలిపింది.  అలాగే తుది డివిడెండ్‌ను కంపెనీ బోర్డు  ప్రకటించలేదు.  దీంతో 2019-20 ఆర్థిక సంవత్సరానికి మొత్తం డివిడెండ్ ఈక్విటీ షేరుకు రూ. 1 గానే వుంది.

చదవండి : ట్రంప్ టీంలో మన దిగ్గజాలు

మరిన్ని వార్తలు