వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి 

27 Jun, 2019 13:10 IST|Sakshi

సాక్షి, నిర్మల్‌ (ఆదిలాబాద్‌) : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇరువురు మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకున్నాయి. నిర్మల్‌ మండలానికి చెందిన లింగన్నను కారు ఢీకొనడంగా మృతి చెందగా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక ఉపసర్పంచ్‌ స్వామి హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.  మండలంలోని చిట్యాల్‌ బ్రిడ్జి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముజ్గి గ్రామానికి చెందిన వంటల లింగన్న(45) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. వంటల లింగన్న తన భార్య లక్ష్మితో కలిసి గ్రామం నుంచి నిర్మల్‌ వెళ్తున్నారు. చిట్యాల బ్రిడ్జి వద్దకు రాగానే వెనుకనుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో లింగన్న ఎగిరి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టాడు. దీంతో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య లక్ష్మీకి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.

ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉండే లింగన్న గత నెల క్రితం తన తల్లి చనిపోవడంతో సొంతూరికి వచ్చాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.  దండేపల్లి మండలంలోని ద్వారక మాజీ సర్పంచ్‌ గొర్రె స్వామి(42) హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్వామి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆర్టీసీలో బస్‌ కండక్టర్‌గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వగ్రామం ద్వారకకు తీసుకువచ్చి అంతక్రియలు నిర్వహించారు. ఆయన మృతిపై పలువురుమండల నాయకులు విచారం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు