మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం

15 Mar, 2020 05:00 IST|Sakshi
దాడిలో గాయపడిన రెడ్డయ్య

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డి అనుచరుడిపై దాడి 

జమ్మలమడుగు:  వైఎస్సార్‌ జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించే విధంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డి అనుచరులపై వీరంగం సృష్టించారు. శనివారం రాత్రి సుధీర్‌రెడ్డి అనుచరుడైన రెడ్డయ్యపై దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రౌడీయిజం చెలాయించి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు పోలీసుస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని సుగుమంచిపల్లె వద్ద వాహనం నిలబెట్టి మరో మనిషి కోసం వేచి ఉన్న రెడ్డయ్యను ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కొట్టించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుధీర్‌రెడ్డి కథ చూస్తామంటూ బెదిరించారు 
అంకాలమ్మ గూడురుకు వెళ్లడం కోసం వాహనంలో సుగుమంచిపల్లె మీద వెళ్లామని, అయితే మరో వ్యక్తి వస్తుండటంతో వేచి ఉన్నామని, ఇంతలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నీవు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుడైన చిలంకూరు మోహన్‌రెడ్డి మనిషివి కదా అంటూ తనపై దాడి చేశారని బాధితుడు రెడ్డయ్య తెలిపారు. ఎమ్మెల్యే మనుషులం కాదని, వేరే వ్యక్తి కోసం వేచి ఉన్నామని చెప్పినా వినకుండా కొట్టారని వాపోయారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కథ కూడా చూస్తామంటూ బెదిరించారని బాధితుడు రెడ్డయ్య చెప్పారు.  

మరిన్ని వార్తలు