‘జీరో ఎఫ్‌ఐఆర్‌’తో నిందితుడి అరెస్ట్‌

5 Dec, 2019 19:52 IST|Sakshi
నిందితుడు నూర్ మహ్మద్

సాక్షి, అనంతపురం: పోలీస్‌ స్టేషన్ల పరిధితో సంబంధం లేకుండా యువతి ఫిర్యాదు మేరకు అనంతపురం జిల్లా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు యువతిని వేధిస్తున్న డ్రైవర్‌ను తక్షణమే అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వోల్వో బస్సులో మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై రిలీవింగ్ డ్రైవర్ నూర్ మహ్మద్ వేధింపులకు దిగాడు. యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు డయల్ 100 నంబరుకు ఫోన్‌ చేసి పోలీసులు సమాచారం అందించించారు. వెంటనే స్పందించిన పోలీసులు అనంతపురం తపోవనంలో బస్సు ఆపారు.

నాలుగో టౌన్‌ పోలీసులు బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకొని జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్ నూర్ మహ్మద్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు యువతిని అదే బస్సులో బెంగళూరుకు పంపించారు. ఏపీ పోలీసులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవడంపై బస్సులోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని అమలు చేస్తున్న తీరును ప్రశంసించారు. కాగా, కృష్ణా జిల్లా నందిగామ పరిధిలో మొట్ట మొదటి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. బాలుడి మిస్సింగ్‌ కేసు సంబంధించి కంచికచర్ల పోలీసులు తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

మరిన్ని వార్తలు