లిఫ్ట్‌లో తల ఇరుక్కుని బాలుడి మృతి

27 Feb, 2019 09:26 IST|Sakshi
హేమంత్‌ మృతదేహం

మేడ్చల్‌: లిఫ్ట్‌లో తల ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్, బాలాజీనగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన బాలచంద్రయ్య బాలాజీనగర్‌లోని తిరుమల నిలయం అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. అతని కుమారుడు హేమంత్‌కుమార్‌(10) స్థానిక రోజరి కాన్వెంట్‌ స్కూల్‌లో 5వ తరగతి చదవుతున్నాడు. మంగళవారం సాయంత్రం స్కూల్‌ నుంచి వచ్చిన హేమంత్‌ ఆడుకుంటూ లిఫ్ట్‌ వద్దకు వెళ్లాడు. లిఫ్ట్‌ డోర్‌ తెరుచుకోవడంతో తల లోపలికి పెట్టి చూస్తుండగా అదే సమయంలో లిఫ్ట్‌ ఆన్‌ కావడంతో మధ్యలో చిక్కుకున్న అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మేడ్చల్‌ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు.   మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు