పెళ్లి మండపం నుంచి వధువు ఎస్కేప్‌

9 Jul, 2018 10:12 IST|Sakshi

అదే ముహూర్తంలో వరుడికి మరో యువతితో వివాహం

మైసూరు: మరికొద్ది క్షణాల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వధువు ప్రేమించిన వ్యక్తితో పారిపోగా వరుడు అదే మండపంలో మరొక యువతి మెడలో తాళికట్టిన ఘటన ఆదివారం జిల్లాలోని నంజనగూడు పట్టణంలో చోటు చేసుకుంది. తాలూకాలోని మార్బళ్లి గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తికి హెచ్‌డీ కోటె తాలూకాలోని హోసహళ్లి గ్రామానికి చెందిన యువతితో ఆరు నెలల క్రితం నిశ్చితార్థమైంది. ఈ క్రమంలో ఆదివారం పట్టణంలోని శ్రీకంఠేశ్వర కళ్యాణ మండపంలో నందిని, నారాయణల వివాహం జరగాల్సి ఉంది.

శనివారం రాత్రి వధూ, వరులతో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, బంధు మిత్రులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం శాస్త్రోక్త కార్యక్రమాలు పూర్తయిన అనంతరం వధువు నందిని అందరి కళ్లుకప్పి కళ్యాణ మంటపడం నుంచి ప్రేమించిన వ్యక్తితో పారిపోయింది. విషయం బయటకు రావడంతో తమ కుమారుడి వివాహం రద్దు చేయడం ఇష్టం లేని నారాయణ తల్లితండ్రులు వివాహానికి వచ్చిన బంధువుల యువతితో అదే ముహూర్తానికి వివాహం జరిపించారు. కూతురు చేసిన పనికి అవమాన భారంతో నందిని తల్లితండ్రులు కళ్యాణ మంటపంలో కన్నీటి పర్యంతమయ్యారు. 

మరిన్ని వార్తలు