నదిలోకి దూకేసిన కొత్త పెళ్లికూతురు..

15 Jun, 2020 09:17 IST|Sakshi
వధువు కోసం గాలిస్తున్న సహాయక సిబ్బంది

భోపాల్‌ : అప్పుడే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతున్న ఓ వధువు నదిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌ అలపుర్‌కు చెందిన ఓ యువతికి ఆదివారం పెళ్లైంది. ఆ తర్వాత ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో పెళ్లి కూతురిని అత్తారింటికి సాగనంపే వేడుక జరిగింది. అనంతరం భర్త, అత్తామామలతో కలిసి ఆమె మధ్యప్రదేశ్‌ షియోపూర్‌లోని అత్తారింటికి కారులో బయలు దేరింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మధ్యప్రదేశ్‌, షియోపూర్‌ చంబల్‌ నదిపై ఉన్న పాళి వంతెనపై వెళుతోంది. తనకు వాంతి వస్తోందని, కారు ఆపాలని వధువు డ్రైవర్‌ను కోరింది. అయితే డ్రైవర్‌ ఇందుకు ఒప్పుకోలేదు. ( తీవ్ర ఉత్కంఠ, ప్రాణాలకు తెగించి మరీ.! )

దీంతో ఆమె స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో డ్రైవర్‌ బ్రేకులు వేశాడు. పెళ్లికుమారుడు, అతడి తల్లిదండ్రులు ఏం జరుగుతోందో అర్థం చేసుకునే లోపే.. వధువు కారు నుంచి బయటకు దిగి నదిలో దూకేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వధువు కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ గల్లంతు అయిన వధువు ఆచూకీ ఇంకా తెలియలేదు. ఈ సంఘటనపై వధువు తండ్రి మాట్లాడుతూ.. ‘‘ శనివారం రాత్రి పెళ్లి జరిగినప్పుడు కూడా తను బాగానే ఉంది. ఇంతలో ఏమైందో అర్థం కావటం లేదు’’ అంటూ వాపోయారు. ( ఉపాధి ఎరగా.. వ్యభిచార కూపంలోకి.. )

మరిన్ని వార్తలు