మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

3 Jun, 2019 07:19 IST|Sakshi

ఇద్దరు ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాల అపహరణ

కేసముద్రం: సిగ్నల్‌ టాంపరింగ్‌తో రైలును నిలిపివేసిన దొంగలు ఇద్దరు ప్రయాణికుల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కుని పరారయ్యారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రం రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఐబీ సిగ్నల్‌ పాయింట్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మణుగూరు నుంచి సికింద్రాబాద్‌ వైపు శనివారం రాత్రి మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. కేసముద్రం–తాళ్లపూసపల్లి రైల్వేస్టేషన్‌ల మధ్య ఆదివారం తెల్లవారుజామున 1.40 గంటలకు రైలు ఆగిపోయింది. అప్పటికే ఎస్‌–5 బోగీలో కాచుకుని ఉన్న దుండగులు, భాగ్యనగర్‌తండాకు చెందిన మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు పుస్తెలతాడు, అదే తండాకు చెందిన మరో వ్యక్తి మెడలో ఉన్న తులంనర బంగారు చైన్‌ లాక్కుపోయారు.

బాధితులు కేకలు వేయడంతో దుండగులు ఎస్‌–6 బోగీలోకి పరుగుతీసి అక్కడా చోరీకి ప్రయ త్నించగా ప్రయాణికులు గట్టిగా కేకలు పెట్టడంతో కిందకు దూకి పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను విచారించగా ముగ్గురు వ్యక్తులు బోగీలోకి వచ్చినట్లు తెలిపారు. దీంతో ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ బృందం చుట్టుపక్కల గాలింపు చేపట్టింది. బాధి తులు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సిగ్నల్‌ టాంపరింగ్‌ చేయడం ద్వారా దుండగులు రైలును నిలిపివేసినట్లు అనుమానిస్తున్నామని జీఆర్‌పీ సీఐ వినయ్‌కుమార్‌ చెప్పారు. ఇదే ప్రాంతంలో ఈ ఘటనకు ముందూ దుండగులు బెంగళూరు నుంచి పట్నా వెళ్లే సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ను ఆపడానికి ప్రయత్నించినట్టు తెలిసింది.  

మరిన్ని వార్తలు