సీబీఐ ఆఫీసర్లమని చెప్పి.. కిడ్నాప్‌ డ్రామా

14 Dec, 2019 19:08 IST|Sakshi

కోల్‌కతా : సీబీఐ ఆఫీసర్లమని అని చెప్పి ఒక వ్యక్తి కిడ్నాప్‌కు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. అయితే ఇక్కడ కిడ్నాప్‌ చేద్దామనుకున్న వ్యక్తి స్వయానా మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్. బిరెన్ సింగ్ సోదరుడు కావడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే .. బిరెన్‌ సింగ్‌ సోదరుడు టోంగ్‌బ్రామ్ లుఖోయ్ సింగ్ కోల్‌కతాలో నివాసముంటున్నారు. కాగా శుక్రవారం ఐదుగురు వ్యక్తులు న్యూటౌన్‌లో లుఖోయ్‌ సింగ్‌ కొత్తగా తీసుకున్న ఇంటికి వచ్చారు. తాము సీబీఐ ఆఫీసర్లమని చెప్పి ఇంట్లోకి చొరబడి లుఖోయ్‌ సింగ్‌తో పాటు మరొకరిని కిడ్నాప్‌ చేశారు. తర్వాత సింగ్‌ భార్యకు ఫోన్‌ చేసి రూ. 15 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీంతో సింగ్‌ భార్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఐదుగురిలో ఇద్దరిని శుక్రవారం సాయంత్రమే అదుపులోకి తీసుకున్నారు.

మిగతా ముగ్గురిని కూడా శనివారం ఉదయం సెంట్రల్‌ కోల్‌కతాలోని బేనియాపుకుర్‌లో అరెస్టు చేసి వారి వద్ద నుంచి రెండు వాహనాలు, మూడు నకిలీ తుపాకులు, రూ. 2లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. అరెస్టైన వారిలో ఇద్దరు మణిపూర్‌, మరో ఇద్దరు కోల్‌కతా, ఒకరు పంజాబ్‌కు చెందిన వారిగా గుర్తించామని వెల్లడించారు. కాగా, వీరిపై గతంలో కూడా పలు క్రిమినల్‌ రికార్డులు ఉన్నాయని, కేవలం డబ్బు కోసమే ఈ పనికి పాల్పడినట్లు మా విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు