భార్యపై అనుమానంతో దారుణంగా హత్య

19 Dec, 2023 12:19 IST|Sakshi

టంగుటూరు: భార్యపై అనుమానంతో ఆమె భర్త కత్తితో మెడ కోసి చంపి బాత్‌రూమ్‌లో పడేసి పరారైన సంఘటన టంగుటూరు తహసీల్దార్‌ కార్యాలయం వెనుక పోతుల చెంచయ్య వెస్ట్‌ట్‌ కాలనీలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు జిల్లా కావలి మండలం చైన్నెపాలెం గ్రామానికి చెందిన పామంచి బాబు, బాపట్ల జిల్లా చినగంజాం గ్రామానికి చెందిన సంతోషమ్మ(31)కు పదేళ్ల క్రితం వివాహమైంది. వారికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ఏడు నెలల క్రితం చైన్నెపాలెం నుంచి టంగుటూరు పోతుల చెంచయ్య వెస్ట్‌ కాలనీకి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. సంతోషమ్మ రొయ్యల ఫ్యాక్టరీలో పనికి వెళ్తుండగా, పామంచి బాబు కర్ణాటక రాష్ట్రం మంగుళూరులో సముద్రపు వేటకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు.

మూడు రోజుల క్రితం మంగుళూరు నుంచి టంగుటూరు వచ్చిన బాబు.. భార్యపై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం 9 గంటలకు కత్తితో ఆమె మెడ కోసి హతమార్చి బాత్‌రూమ్‌లో పడేసి పరారయ్యాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సింగరాయకొండ సీఐ దాచేపల్లి రంగనాథ్‌, ఎస్సై ఖాదర్‌బాషా.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

>
మరిన్ని వార్తలు