బాధితులపై కానిస్టేబుళ్ల దాడి

28 Jun, 2019 08:35 IST|Sakshi

సాక్షి, జమ్మలమడుగు(కడప) : న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులపై కానిస్టేబుళ్లు  దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుండి. నెహ్రూనగర్‌ వీధికి చెందిన మహిళా వలంటీర్‌ ఝాన్సీ కుటుంబ సభ్యులతో కలిసి తమని వేధిస్తున్న నరసింహులుపై ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు బాధితులపై దాడి చేయడంతోపాటు అసభ్యపదజాలంతో దూషించారు. బాధితులు స్టేషన్‌ బయట బైఠాయించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన నరసింహులు పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఝాన్సీని వేధిస్తున్నాడు. గురువారం సాయంత్రం నరసింహులు ఝాన్సీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు.

ఇంట్లో ఉన్న ఝాన్సీ భర్త సురేష్‌పై దాడి చేశాడు..కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కానిస్టేబుళ్లు ప్రకాశ్,వాసు తమపై దాడి చేసి అసభ్యపదజాలంతో దూషించినట్లు బాధితులు తెలిపారు. కానిస్టేబుల్‌ వాసు ఝాన్సీ అన్న చెన్నయ్యపై చేయి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఝన్సీ మాట్లాడుతూ తమపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఝన్సీ ఇంటిపై దాడికి వెళ్లిన నరసింహులు, చెన్నయ్యపై చేయి చేసుకున్న కానిస్టేబుళ్లపై బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని డీఎస్పీ కోలా కృష్ణన్‌ సీఐ శ్రీనివాసులకు సూచించారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు కేసులను నమోదు చేస్తున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. 

మరిన్ని వార్తలు