సెంట్రల్‌ వర్సిటీ  విద్యార్థిని ఆత్మహత్య

2 Dec, 2019 08:26 IST|Sakshi

సాక్షి, చెన్నై: తిరువారూర్‌లోని సెంట్రల్‌ వర్సిటీలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సమాచారంతో ఆ వర్సిటీ విద్యార్థినుల్లో ఆందోళన మొదలైంది. కాగా కృష్ణగిరి జిల్లా హొసూరుకు చెందిన ఇంజినీరు మురళి, లలిత ప్రియదంపతుల కుమార్తె మైథిలి(19) తిరువారూర్‌ నీలకుడిలోని తమిళనాడు సెంట్రల్‌ వర్సిటీలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతోంది. అక్కడి హాస్టల్‌లో బస చేస్తూ, చదువుకుంటున్న మైథిల్‌ ఆత్మహత్య కలకలం రేపింది. మైథిలితో పాటు హాస్టల్లో నలుగురు విద్యార్థినులు ఉన్నారు. కళాశాలకు సెలవు కావడంతో ఇద్దరు విద్యార్థినులు వారి స్వస్థలాలకు వెళ్లారు. మైథిలితో పాటు రాజశ్రీ అనే విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉన్నారు. శనివారం రాత్రి టిఫిన్‌ తినేందుకు రాజశ్రీ మెస్‌కు వెళ్లింది. మైథిలిని పిలవగా, తాను కాసేపటి తర్వాత వస్తానని సమాధానం ఇవ్వడంతో ఆమె మాత్రమే వెళ్లింది. టిఫిన్‌ ముగించుకుని తొమ్మిదిన్నర గంటలసమయంలో తన గది వద్దకు రాజశ్రీ వచ్చింది. 

చదవండి: చదువు చావుకొస్తోంది! 

అయితే, తలుపు లోపల గడియ పెట్టి ఉండడం, ఎంతకు తెరచుకోకపోవడంతో అనుమానం వచ్చి అక్కడి సిబ్బందికి సమాచారం అందించింది. తలుపు పగులగొట్టి చూడగా, ఆ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మైథిలి వేళాడుతుండడంతో అక్కడ కలకలం బయలు దేరింది. హాస్టళ్లో› ఉన్న విద్యార్థినులు అందరూ భయంతో వణికి పోయారు. సమాచారం అందుకున్న నన్నిలం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రాజశ్రీ వద్ద విచారించారు. ఆ గదిలో ఏదైనా లేఖ ఉందా అని తనిఖీ చేశారు. మృతదేహాన్ని అర్ధరాత్రి పోస్టుమార్టం నిమిత్తం తిరువారూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

సమాచారం అందుకున్న మైథిలీ కుటుంబం శోక సంద్రంలో మునిగింది. అయితే, ఆమె ఆత్మహత్య కారణాలు తెలియకపోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి ఉన్నారు. కాగా, ఇదే వర్సిటీలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతున్న కర్ణాటక రాష్ట్రం మైసూర్‌కు చెందిన కరణ్‌ పటేల్‌(21) విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా, రెండో సంఘటన చోటుచేసుకోవడం ఆందోళన కల్గిస్తున్నది. ఇక, చెన్నై ఐఐటీలో ఫాతిమా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే, సెంట్రల్‌ వర్సిటీలో మైథిలి బలన్మరణానికి పాల్పడడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.

మరిన్ని వార్తలు