కొత్త మోసాలకు తెర!

6 Aug, 2018 13:47 IST|Sakshi

టెక్నాలజీని వినియోగించుకుని రెచ్చిపోతున్న కేటుగాళ్లు

ఆన్‌లైన్‌లో పరిచయమైజాబ్‌లు ఇస్తామంటూకుచ్చుటోపీలు

పేకముక్కలు, చేతివాచీలకుమైక్రోచిప్‌లు అమర్చి లక్షల్లో టోకరా

సాక్షి, గుంటూరు: రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల్లో ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని మోసగాళ్లు తెగబడుతున్నారు. లాటరీ టికెట్‌లు, లక్కీ డ్రాలో గిఫ్ట్‌లు గెలుచుకున్నారు, బ్యాంక్‌ అధికారుల మంటూ ఫోన్‌లు, మెసేజ్‌లు చేసి క్రెడిట్, డెబిట్‌ కార్డుల పాస్‌వర్డులు తెలుసుకుని అకౌంట్‌లు ఖాళీ చేయడం ఇప్పటి వరకూ మనం చూశాం. కానీ వీటన్నింటికీ భిన్నంగా కొందరు కేటుగాళ్లు టెక్నాలజీని వినియోగించి పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. పేక ముక్కలు, చేతి వాచీలకు మైక్రో చిప్‌లు అమర్చి సెల్‌ఫోన్‌ స్కానర్‌ల ద్వారా పేకాటరాయుళ్లని బురిడి కొట్టించి రూ. లక్షల్లో డబ్బు దోచేయ్యడం, నౌకరీ డాట్‌ కామ్‌ ద్వారా పరిచయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేయడం వంటి ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

ఘరాన మోసాలు..
ఇటీవల తెనాలి–2టౌన్‌ పరిధిలో ఇద్దరు యువకులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌  ద్వారా సెల్‌ఫోన్‌కు మైక్రోచిప్‌లను అనుసంధానం చేశారు. వాటిని ప్రత్యేకంగా పేక ముక్కల్లో అమర్చి నకిలీ పేకలను తయారు చేయించారు. ఆపై వాటిని వినియోగిస్తూ, చేతివాచీ, నడుం కెమెరా, డబ్బు కట్టల్లో స్కానర్లు, ఎదుటి వారి పేకల వివరాలను సునా యాసంగా తెలుసుకునేలా రూపొందిం చారు. ఒకవేళ సెల్‌ఫోన్‌ను పేకాట వద్ద అనుమతింకపోతే  కీచైన్‌లో అమర్చిన స్కానర్ల తో   సెల్‌ఫోన్‌ నుంచి బ్లూటూత్‌ ద్వారా వచ్చే సమాచారం ద్వారా తెలుసుకుంటూ ఎదుటి వారిని మోసం చేస్తూ సొమ్ము చేసుకుని గుంటూరు రూరల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ముఠా చేసిన మోసానికి రేపల్లేకు చెందిన ఒక వ్యక్తి రూ. 40 లక్షలు మోసపోయి ఆత్మహత్యకు యత్నించాడు. ఇదే తరహాలో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రూ. 15లక్షలు మోసపోయాడు ఇలా వీరి చేతిలో మోసపోయిన వారి చిట్టా చాలనే ఉంది.  ఇదే తరహాలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అమూల్యా అనే వ్యక్తి నౌకరీ డాట్‌ కామ్‌ అనే జాబ్‌ అలర్ట్స్‌ వెబ్‌ సైట్‌ ద్వారా జిల్లాకు చెందిన కొందరికి పరిచయమై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని వి«విధ జిల్లాలోని నిరుద్యోగుల నుంచి రూ. కోటికిపైగా వసూలు చేసిన ఘటన సైతం ఈ కోవకు చెందినదే.

ఆందోళనలో పేకాట రాయుళ్లు, నిరుద్యోగులు
వరుస ఘటనల నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పేకాట శిబిరాల్లో కొత్త వ్యక్తులకు ప్రవేశం ఇవ్వడానికి ఆయా యజమానులు భయపడుతున్నట్టు తెలుస్తోంది. పేకాటరాయుళ్లు సైతం పరిచయం లేని వ్యక్తులతో పేకాట ఆడేందుకు సుముఖత చూపడం లేదని తెలుస్తోంది. ఏ వైపు నుంచి ఎలాంటి మోసం చేస్తారోనని పేకాటరాయుళ్లు, శిబిరాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులు సైతం ఉద్యోగం ఇంటర్‌నెట్‌లో వచ్చే వివిధ రకాల జాబ్‌ అలర్ట్‌లు నమ్మడానికి వెనుకాడుతున్నారు. ప్రైవేటు వెబ్‌సైట్లలో కేటుగాళ్లు కాచుకు కూర్చుని మోసాలకు పాల్పడుతుండటంతో కొత్త వ్యక్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చినా ఆ ఉద్యోగాల్లో చేరేందుకు భయపడుతున్నారు. బంధువులు, స్నేహితుల ద్వారా రెఫరెన్సులు పెట్టించుకుని ఉద్యోగాల్లో చేరేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి
ప్రభుత్వ వెబ్‌సైట్ల ద్వారా వచ్చే జాబ్‌ అలర్ట్స్‌ను మా త్రమే యువత పా టించి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ వెబ్‌సైట్లలో మాత్రమే కచ్చితమైన సమాచారం ఉంటుంది. ఎవరూ మోసాలకు పాల్పడ్డానికి అవకాశం ఉండదు. వెబ్‌సైట్ల ద్వారా పరిచయమై ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేవారిని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలి.– సీహెచ్‌. వెంకటప్పలనాయుడు, రూరల్‌ ఎస్పీ

మరిన్ని వార్తలు