వాహనాల్లో డీజిల్‌ చోరీ

6 Aug, 2018 13:58 IST|Sakshi
డీజిల్‌ చోరీ కోసం పగులగొట్టిన టిప్పర్‌ లారీ ట్యాంక్‌ 

బయ్యారంలో ఆందోళన చెందుతున్న వాహనదారులు

బయ్యారం(ఇల్లందు) : నిలిపి ఉన్న వాహనాలను లక్ష్యంగా చేసుకుని కొన్ని రోజులుగా రాత్రివేళల్లో బయ్యారంలో డీజిల్‌ దొంగతనాలు జరుగుతున్నాయి. మానుకోటకు చెందిన వర్సటైల్‌ పాఠశాల బస్సును గత నెల 22న బయ్యారం సంత సమీపంలో నిలిపి ఉంచారు. రాత్రి వేళ బస్సు డీజిల్‌ ట్యాంకు మూతను పగులకొట్టి డీజిల్‌ను మాయం చేశారు. ఆ తర్వాత డీజిల్‌ చోరీకి మరో రెండు స్కూల్‌ బస్సుల ట్యాంకు మూతలను సైతం పగులకొట్టేందుకు విఫలయత్నం చేశారు.

అలాగే గత నెల 30న మానుకోటకు చెందిన హోలీఏంజిల్స్‌ పాఠశాల బస్సు డీజిల్‌ట్యాంకు మూతను రాత్రి వేళ పగులగొట్టి డీజిల్‌ను అపహరించారు. శనివారం రాత్రి బయ్యారంలోని శ్రీనివాస్‌రావు తన ఇంటి సమీపంలో నిలిపి ఉన్న టిప్పర్‌ లారీ డీజిల్‌ ట్యాంకు మూత పగులగొట్టి వంద లీటర్ల వరకు డీజిల్‌ అపహరించారు.

వరుసగా జరుగుతున్న డీజిల్‌ చోరీలతో తమ వాహనాలను బయటపెట్టాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఈ చోరీలపై బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు సైతం చేశారు. కాగా ఈ విషయంపై ఎస్సై రవీందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా విషయం తమ దృష్టికి వచ్చిందని, చోరీలకు పాల్పడుతున్న వారి వివరాలు తెలుసుకునే పనిలో ఉన్నామన్నారు.

మరిన్ని వార్తలు