నడిరోడ్డు మీద కాల్చి చంపేశాడు

25 Sep, 2019 20:51 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దారుణం జరిగింది. నడిరోడ్డు మీదే ఓ వ్యక్తిని కాల్చి చంపేశాడు ఓ దుండగుడు. ఈ ఘటన ఢిల్లీలోని ద్వారకా విహార్‌ రోడ్డులో చోటుచేసుకుంది. వివరాలు.. నరేంద్ర గెహ్లోత్‌(48) అనే వ్యక్తి ప్రాపర్టీ డీలర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఆఫీసు నుంచి ఇంటికి కారులో బయల్దేరాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న గుర్తు తెలియని వ్యక్తి నరేంద్రపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో అతడిని కారుతో ఢీకొట్టేందుకు నరేంద్ర ప్రయత్నించగా.. ఆగంతకుడు మరో కారు మీదకు ఎక్కి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో అతడి నుంచి తప్పించుకునేందుకు నరేంద్ర కారు దిగి పారిపోతుండగా.. నిందితుడు గురి చూసి నరేంద్ర కాళ్లలో బుల్లెట్లు దింపాడు.

ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నరేంద్ర ఆస్పత్రికి చేర్చే సమయానికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా నరేంద్ర శత్రువులు ఉద్దేశపూర్వకంగానే అతడిని హత్య చేసినట్లు భావిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నిందితుడు హెల్మెట్‌ ధరించి ఉన్నాడని.. అతడి బైక్‌ కోసం గాలిస్తున్నామని తెలిపారు. నరేంద్ర ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడని.. అతడిపై గతంలో హత్యాయత్నం కేసు నమోదైందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఘటనపై లోతుగా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు