పాకెట్‌ మనీ కోసం యూనివర్సిటీ విద్యార్థి నిర్వాకం

28 Aug, 2018 13:18 IST|Sakshi
నిందుతుడు విశాల్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : స్నేహితులతో కలసి జల్సాలు చేయడానికి అలవాటు పడ్డ ఓ యూనివర్సిటీ విద్యార్ధి దొంగగా మారాడు. వివరాల ప్రకారం.. తుగ్లాకాబాద్‌కు చెందిన విశాల్‌(24) ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాడు. విలాసాలకు అలవాటు పడిన విశాల్‌ స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేయడం కోసం దొంగగా మారాడు. మనుషుల కళ్లు కప్పి, వారి వస్తువులను దొంగతనం చేసేవాడు. ఆ వస్తువులను అమ్మగా వచ్చిన డబ్బుతో స్నేహితులతో కలిసి తాగి ఎంజాయ్‌ చేసేవాడు.

ఈ క్రమంలో రెండు రోజుల క్రితం విశాల్‌ తన స్నేహితులతో కలిసి తుగ్లాకాబాద్‌ కోట దగ్గర మాటు వేశాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి అక్కడ ఇద్దరూ మోడల్స్‌ని ఫోటో తీస్తూ కనిపించాడు. దాంతో విశాల్‌ ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లి ఇక్కడ ఫోటోలు తీయకూడదంటూ అతనితో వాదించడం ప్రారంభించాడు. ఇలా ఆ ఫోటోగ్రాఫర్‌తో గొడవ జరుగుతున్నప్పుడే, విశాల్‌ అతని దగ్గర ఉన్న కెమరాను లాక్కొని పారిపోయాడు.

దాంతో ఆ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. సదరు ఫోటోగ్రాఫర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విశాల్‌ కోసం గాలింపు ప్రారంభించారు. అనంతరం పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకుని అతను దొంగిలించిన ‘నికాన్‌ డీఎస్‌ఎల్‌ఆర్‌’ కెమరాను సదరు ఫోటోగ్రాఫర్‌కి అప్పగించారు. పాకెట్‌ మనీ కోసమే తాను దొంగగా మారినట్లు విశాల్‌ తెలిపాడని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు