క్యాంపస్‌ హస్టల్‌లో ఉరి వేసుకుని వైద్యుడి మృతా

15 Jun, 2019 13:05 IST|Sakshi

చండీగఢ్‌ : ఉన్నత విద్యాసంస్కారాలకు నిలయాలుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలు వేధింపులకు కేంద్రంగా మారుతున్నాయి. హెచ్‌వోడీలు, సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. గత నెల సీనియర్ల వేధింపులు తట్టుకోలేక గైనకాలజీ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేట్‌ చేస్తున్న పాయల్‌ సల్మాన్‌ తాడ్వి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. సోదరి పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వకుండా వేధించడంతో ఓ వైద్యుడు క్యాంపస్‌ హస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాలు.. కర్ణాటక ధర్వాడాకు చెందిన ఓంకార్‌(30) హరియాణాలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెన్‌లో పీడియాట్రిక్స్‌లో ఎండీ చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓంకార్‌ సోదరికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వాల్సిందిగా హెచ్‌వోడీని కోరాడు. అందుకు అతను ఒప్పుకోలేదు. కోర్సు విషయంలో కూడా వేధింపులకు గురి చేస్తుండటంతో మనస్థాపం చెందిన ఓంకార్‌ హస్టల్‌లో తన గదిలోని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకన్నాడు. అయితే హెచ్‌ఓడీ వేధింపుల మూలానే ఓంకార్‌ చనిపోయాడని అతని స్నేహితులు చెప్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని గదిలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదన్నారు పోలీసులు.

మరిన్ని వార్తలు