హతవిధీ!

21 Jan, 2019 11:57 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన యువకులు

చెట్టును ఢీకొన్న కారు..నలుగురు విద్యార్థుల దుర్మరణంమరో ముగ్గురి పరిస్థితి విషమంవారంతా 22 ఏళ్ల లోపు యువకులు.అందరూ స్నేహితులు. జీవితానికిబంగారు బాటలు వేసుకోవాలనితల్లిదండ్రులు ఇంజినీరింగ్‌ చదివిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకుసరదాగా గడిపారు. పర్యాటకప్రాంతంలో పర్యటించారు. మరికొద్దిసేపట్లో ఇంటికి చేరుకునేవారు. అర్ధరాత్రి ప్రయాణంనలుగుర్ని కబళించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిఆస్పత్రిపాలయ్యారు. ఈ సంఘటనతో పేర్నంబట్టులోని మనిగైవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎదిగిన బిడ్డలు రాలిపోవడంతో కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు.

వేలూరు: ఆంబూరు సమీపంలో రోడ్డు పక్కనున్న చెట్టును కారు అతి వేగంగా ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వేలూరు జిల్లా పేర్నంబట్టు మనిగై వీధికి చెందిన మహ్మద్‌ సుబాన్‌(22), వానియంబాడిలోని ప్రవేటు కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. అతనితో పాటు అదేప్రాంతానికి చెందిన స్నేహితులు మహ్మద్‌ ఇమ్రాన్‌(22), ఉస్సీన్‌(21), ముసామిల్‌(22), సల్మాన్‌(22), దుపాల్‌(21), మరోక సల్మాన్‌(21) కలసి శనివారం సాయంత్రం గుడియాత్తం సమీపంలోని మేల్‌ ఆలత్తూరు గ్రామంలో నిర్వహించిన ఒక మహానాడులో కలుసుకునేందుకు కారులో వెళ్లారు. మహానాడును పూర్తయిన తర్వాత ఏలగిరి కొండకు వెళ్లి పర్యాటక స్థలాలను తిలకించారు.

అర్ధరాత్రి సమయంలో సొంత గ్రామానికి కారులో బయలుదేరారు. అయతంబట్టు చిన్న వరికం కూట్‌రోడ్డు వద్ద వెలుతున్న సమయంలో కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో మహ్మద్‌ సబాన్, మహ్మద్‌ ఇమ్రాన్, ఉస్సీన్‌ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఉమరాబాద్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షత గాత్రులను వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ముసామిల్‌ మృతిచెందాడు. దుపాల్, సల్మాన్,  మరోక సల్మాన్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఈ సంఘటనపై ఉమరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి నిలోఫర్‌ కబీల్, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందజేయాలని వైద్యులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు