కల్లు తాగించి నగలు దోచుకుంటున్న ముఠా అరెస్ట్‌

22 Dec, 2017 17:51 IST|Sakshi

హైదరాబాద్‌ : ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తూ వారికి పీకల దాకా కల్లు తాగించి నగలను దోసుకెళుతున్న ముగ్గురు మోసగాళ్లను సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 5 తులాల బంగారం, 40 తులాల వెండి, ఒక ఆటో , సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ శశిధర్ రాజు విలేఖరులకు వివరాలు వెల్లడించారు. హయత్ నగర్‌లో నివాసం ఉంటున్న తిరుపతి అనే వ్యక్తి పలు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం ప్రారంభించాడు.

ఇతను ఒంటరిగా ఉన్న మహిళలను ఆటోలో ఎక్కించుకొని కల్లు కాంపౌండుకు తీసుకెళ్లి మత్తు ఎక్కేలా మందు తాగించేవాడు. స్పృహ కోల్పోయాక వచ్చిన ఆటోలోనే ఎక్కించుకొని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలోకి తీసుకెళ్లి వారి వద్ద ఉన్న బంగారు నగలను దోచుకొని పారిపోయేవాడు. సీసీఫుటేజీ సహాయంతో ఇతనికి సహకరిస్తున్న ఇద్దరినీ కూడా అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ దోపిడీలు తాము చేశామని ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు.

మరిన్ని వార్తలు