ఊపిరి తీసిన ఊయల తాడు

10 Feb, 2020 08:15 IST|Sakshi

ప్రమాదవశాత్తు మృతి చెందిన చిన్నారి 

సాక్షి, దాచేపల్లి/గుంటూరు: ఊయల ఊగుతుండగా తాడు గొంతుకు బిగుసుకోవడంతో ఓ చిన్నారి మృత్యు ఒడికి చేరింది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం ముత్యాలంపాడు సుగాలి కాలనీలో ఆదివారం జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన మూఢావత్‌ బద్దునాయక్, కమలాబాయి దంపతులకు ఐదుగురు కుమార్తెలు. వీరిలో పెద్ద కుమార్తెకు వివాహం కాగా రెండో కుమార్తె కూలి పనులకు వెళుతోంది. మిగిలిన ముగ్గురు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హైస్కూల్‌లో చదువుకుంటున్నారు.

వీరిలో చిన్న కుమార్తె అయిన మూఢావత్‌ సిరి (10) ఐదో తరగతి చదువుకుంటోంది. ఆదివారం సెలవు కావటంతో ఇంటి వెనుక భాగంలో ఉన్న పశువుల కొట్టంలో వెదురు బొంగుకు తాడును కట్టి ఊయల ఊగుతోంది. ఆ క్రమంలో తాడు జారిపోయి బాలిక గొంతుకు బలంగా బిగుసుకుపోయింది. దీంతో ఊపిరాడక సిరి మృతి చెందింది. పశువుల కొట్టం మీదుగా వెళుతున్న వ్యక్తులు సిరి తాడుకు వేలాడుతున్న విషయాన్ని గమనించి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. అయితే అప్పటికే బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులంతా భోరున విలపిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు