సొంత చెల్లెలిపై అకృత్యం.. దారుణ హత్య

19 Mar, 2019 15:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌ : ఎన్ని చట్టాలు వచ్చినా మృగాళ్ల ప్రవర్తనలో మార్పు మాత్రం రావడం లేదు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కథువా వంటి ఘటనలు నేటికీ కొనసాగుతున్నాయి. పన్నెండేళ్ల చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడి మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తించారు ఇద్దరు అన్నదమ్ములు. మామయ్యతో కలిసి ఆమెపై అకృత్యానికి పాల్పడి దారుణంగా హతమార్చారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో మార్చి 14న జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలు... పరీక్షలు రాసేందుకని స్కూలుకు వెళ్లిన బాధితురాలు మార్చి 14 అదృశ్యమైంది. ఈ క్రమంలో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక బంధువులను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో చోటే పటేల్‌ అనే వ్యక్తితో తమకు భూతగాదాలు ఉన్నాయని, అతడే ఈ చర్యకు పాల్పడి ఉండొచ్చునని ఆమె మామయ్య అనుమానం వ్యక్తం చేశాడు. అయితే పోస్ట్‌మార్టమ్‌ రిపోర్టులో బాలిక సామూహిక అత్యాచారానికి గురైందని తేలడంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

ఈ ఘటన గురించి పోలీసు ఉన్నతాధికారి అమిత్‌ సంఘీ మాట్లాడుతూ.. బాధితురాలి మామయ్యపై అనుమానం రావడంతో అతడిని సుదీర్ఘంగా విచారించామని చెప్పారు. ‘ స్కూలు నుంచి బాధితురాలు ఇంటికి వచ్చే సమయంలో సోదరులు ఇద్దరు  ఆమెను వారి మామ ఇంటికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో మొదట వీరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారి మామ.. ఆ తర్వాత తాను కూడా మృగంలా ప్రవర్తించాడు. ఈ తతంగం మొత్తం అతడి భార్యకు కూడా తెలుసు. కానీ ఆమె కూడా వారిని వారించలేదు సరికదా.. బాలిక పోలీసులకు చెప్తానని బెదిరించడంతో గొంతు నులిమి చంపేసింది. అనంతరం బాలిక సోదరులు, మామ కలిసి కొడవలితో ఆమె తలను నరికారు. మొండాన్ని, తలను తమ పొలాల్లో వేర్వేరు చోట్ల పడేశారు. ఆ తర్వాత ఈ నెపాన్ని తమతో భూతగాదాలున్న వ్యక్తిపై మోపాలని చూశారు. ఇందుకు సంబంధించి పూర్తి సాక్ష్యాలు లభించాయి. బాధితురాలి మామ, ఒక సోదరుడి(20)ని అరెస్టు చేశాం. మరొక వ్యక్తి(మైనర్‌) పరారీలో ఉన్నాడు’ అని సంఘీ తెలిపారు.

మరిన్ని వార్తలు