సాయం అడిగిన పాపానికి.. 11 మంది మృగాళ్లు కలిసి..

20 Aug, 2018 10:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచి : జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది.11 మంది మృగాళ్లు కలిసి ఇద్దరు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆగస్టు 16న జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల(ఆగస్టు) 16న ఇద్దరు బాలికలు స్కూటీపై పక్క ఊరికి బయల్దేరారు.  ఈ క్రమంలో లోహర్‌దగా అనే ప్రాంతానికి చేరుకోగానే వారి వాహనం ఆగిపోయింది. దీంతో తమ స్నేహితుడికి ఫోన్‌ చేసి సాయం చేయాల్సిందిగా కోరారు. తాము ఎక్కడ ఉన్నదీ వివరాలతో సహా అతడికి వివరించారు. ఇదే అదునుగా భావించిన సదరు వ్యక్తి సాయం చేస్తాననే నెపంతో 11 మంది వ్యక్తులను వెంటేసుకుని వారు ఉన్న చోటికి వెళ్లాడు.

అడ్డొచ్చిన వ్యక్తిని కొట్టి మరీ...
బాలికల వద్ద ఉన్న సెల్‌ఫోన్లను లాక్కొని, 11 మంది కలిసి అకృత్యానికి పాల్పడ్డారు.  అదే దారిలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడిని కూడా దారుణంగా కొట్టారు. ఈ తతంగాన్నంతా ఫొటోలు తీస్తూ రాక్షసానందం పొందారు. ఘటనకు సంబంధించి బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అకృత్యానికి పాల్పడ్డ వారంతా 18 నుంచి 28 ఏళ్ల లోపు వారేనని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు