నవ వరుడు ఆత్మహత్య

7 May, 2019 09:07 IST|Sakshi

ప్రేమ వివాహం చేసుకున్న నాలుగు రోజులకే..

చెన్నై , టీ.నగర్‌: వివాహమైన నాలుగు రోజుల్లోనే నవ వరుడు ఆదివారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై అశోక్‌నగర్‌లో ఈ సంఘటన సంచలనం కలిగించింది. విల్లుపురానికి చెందిన సంతోష్‌కుమార్‌ (26) ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు. ఇతను తిరుక్కోవిలూరుకు చెందిన మీనా (24) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం సంతోష్‌కుమార్‌ తల్లిదండ్రులకు తెలిసింది.

దీంతో వారు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇలాఉండగా విల్లుపురం మహిళా పోలీసు స్టేషన్‌లో మీనా సంతోష్‌కుమార్‌ తనను ప్రేమించి మోసగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఫిర్యాదు చేసింది. దీంతో సంతోష్‌కుమార్, మీనాను నాలుగు రోజుల క్రితం వివాహం చేసుకున్నాడు. చెన్నై అశోక్‌నగర్‌లోని ఒక ప్రైవేటు పాఠశాలలో మీనా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. దీంతో వారు వెస్ట్‌ మాంబళంలోని పరోటా వీధిలో కాపురం పెట్టారు. ఇలావుండగా ఆదివారం విల్లుపురంలోని ఓ ఆలయానికి మీనా వెళ్లింది. అక్కడ స్వామి దర్శనం చేసుకుని భర్తకు ఫోన్‌ చేసింది. అతను చాలా సేపు లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానించిన మీనా ఇంటి సమీపంలోని వారిని ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి కిటికీలో చూడగా అతను ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీనిగురించి అశోక్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం రాయపేట ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు