భారీగా పేలుడు పదార్థాల పట్టివేత

6 Jul, 2018 14:44 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలు 

హసన్‌పర్తి: హసన్‌పర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. అనుమతి లేకుండా నిల్వ చేసిన పేలుడు పదార్థాలను టాస్క్‌ఫోర్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండలం లోని ఎర్రగట్టు గుట్ట వద్ద గల తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో పేలుడు పదార్థాలు ఉన్నాయని టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సమాచారం అందింది.

ఈ మేరకు  టాస్క్‌ఫోర్స్‌ అధికారులు  దాడులు నిర్వహించగా  207 డిటోనేటర్లు, 307 జిలెటì న్‌ స్టిక్స్, డ్రిల్లింగ్‌ జాక్‌లు లభ్యమయ్యాయి.  అలాగే ఆరెపల్లి సమీపంలో ఓ పేలుడు పదార్థాల గోదాంపై టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో 9,000 జిలెటిక్‌ స్టిక్స్, 8,950 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు, 4,000 ఆర్డినరీ డిటోనేటర్లు, 23 నాన్‌ ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, 50 కిలోల గన్‌ పౌడర్‌ను పట్టుకున్నారు.

గన్‌పౌడర్‌ను తరలిస్తున్న ఆటోను సీజ్‌ చేశారు. ఈ సంఘటనలో భీమదేవరపల్లి మండలం కొప్పుర్‌కు(ప్రస్తుతం అమరావతినగర్, హన్మకొండ) చెందిన వేల్పుల స్వామి, చింతగట్టుకు చెందిన దాసరి రమేష్, మడిపల్లికి చెందిన ఆటో డ్రైవర్‌ వి.అజయ్, నల్లగొండ జిల్లా తుమ్మలగూడెం రామన్నపేటకు చెందిన వరికొప్పుల శ్రీశైలం, వరికొప్పుల దయాకర్‌తోపాటు నాగార్జున కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ సైట్‌ ఇంజనీర్‌ రవికుమార్‌ సింగ్‌పై కేసు నమోదు చేశారు.

అలాగే ఆరెపల్లిలో జరిగిన దాడుల్లో వేల్పుల అజయ్‌పై కేసు నమోదైంది. పేలుడు పదార్థాలను హసన్‌పర్తి ఎస్సై సుధాకర్‌కు అప్పగించారు. దాడుల్లో  టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్యాంసుందర్, శ్రీకాంత్‌రెడ్డి, మహేందర్, కానిస్టేబుళ్లు రజనీకుమార్, రాజేష్‌ పాల్గొన్నారు.

అనుమతి పత్రాలు చూపకపోవడంతో.. 

ఆరెపల్లిలో కొంతకాలంగా పేలుడు పదార్థాల గోదాం నిర్వహిస్తున్నారు. అయితే గురువారం నిర్వహించిన దాడుల్లో నిర్వాహకులు ఎలాంటి అనుమతి పత్రాలు చూపలేదు. అక్కడ స్టాక్‌ రిజిష్టర్‌ నిర్వహణ సక్రమంగా లేనందున సీజ్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు